వీడిన మిస్టరీ: చిన్నారిపై రేప్, హత్యలకు మగపిల్లలకు తల్లి తోడ్పాటు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో ఇటీవల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది మైనర్ బాలురు కావడంతో వారిని అదుపులోకి తీసుకుని విజయవాడ జువైనల్ హోమ్కు తరలించారు.
వారికి సహకరించిన ఒక బాలుడి తల్లిని అరెస్టు చేసి నందిగామ కోర్టులో హాజరుపర్చారు. చిన్నారి ఉప్పెల్లి కోటేశ్వరి (3)ని అదే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యాచారం చేయగా మృతి చెందిందని, ఆ బాలిక మృతి చెందిన విషయాన్ని గుర్తించని వారు పెద్దలకు ఈ విషయం తెలియజేస్తుందన్న అనుమానంతో చిన్నారిని గోనె సంచిలో వేసి కొట్టి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పెరట్లో పడవేసి కనపడకుండా పుల్లలు కప్పారని వివరించారు.
నిందితుల్లో ఒకడైన 15 సంవత్సరాల బాలుడి తల్లి రాహేలమ్మకు అనుమానం వచ్చి కుమారుడిని ప్రశ్నించడంతో విషయం తెలిపాడు. గోనె సంచిలోని చిన్నారి మృతదేహాన్ని తెల్లవారుజామున ఆమె పొలంలో పడేసి రావడంతో పాటు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.