సీఎం ఆఫీస్ వాహనం బీభత్సం: వ్యక్తిని ఢీకొట్టి కిలో మీటరు మేర ఈడ్చుకెళ్లడంతో మృతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయ వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఓ పక్కగా నడుచుకుంటూ వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లిన ఆ వాహనం ఇద్దరు వ్యక్తులను తీవ్ర గాయాలపాల్జేసింది.
పాదచారులపైకి దూసుకెళ్లిన సదరు వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా... అతడిని సుమారు కిలో మీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో సదరు వ్యక్తితో పాటు మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా, వాహనం ఈడ్చుకెళ్లిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని బెజవాడ శ్రీనివాస్(46)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తిని ఉదయ్ కిరణ్ గా గుర్తించారు.
విజయవాడ నగరంలోని కంకిపాడు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు యజమాని, డ్రైవర్ అయిన అన్నె శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
నెల్లూరు: ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.