బిజెపి, టిడిపిలపై వ్యాఖ్యలు: ఉండవల్లి మళ్లీ కాంగ్రెసులోకి?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అలక వహించిన పార్టీని వీడిన కాంగ్రెసు సీనియర్ నేతలు కొంత మంది తిరిగి కాంగ్రెసులోకి వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్య ఈ చర్చను ముందుకు తెచ్చింది. మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరారు.
హర్ష కుమార్ జై సమైక్యాంధ్ర పార్టీలో చేరగా, ఆ పార్టీకి ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాదారుగా వ్యవహరించారు. అయితే, ఆ పార్టీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అప్పటి నుంచి వారిద్దరు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వారు తనతో టచ్లో ఉన్నారని దిగ్విజయ్ సింగ్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చెప్పారు. దీంతో వారిద్దరు తిరిగి కాంగ్రెసులోకి వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఎపికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపినే కాకుండా టిడిపిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారంనాడు తప్పు పట్టారు. దీన్ని బట్టి కూడా ఆయన తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని, కాంగ్రెసులోకి తిరిగి వెళ్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దానికితోడు, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మాజీ మంత్రులు ఒక్కరొక్కరూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యాలయం ఇందిరా భవన్కు వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే, పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బిజెపి మోసం చేసిందని ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. 25 మంది ఎంపీలు పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన టిడిపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిజెపికి మద్దతు ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయని ఆయన విమర్సించారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయ పోరాటం చేయాలని ఆయ సూచించారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి వైపు చూస్తున్నట్లు, బిజెపిలో చేరుతున్నట్లు ఆ మధ్య పుకార్లు చెలరేగాయి. అయితే, ఆయన బిజెపిలో చేరలేదు. బిజెపిలో చేరకుండా ఆయనను ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెసులోకి వస్తారా అనేది చూడాల్సిందే.