బాబు కంప్యూటర్ కనిపెట్టాడు: 'వైయస్ కొడుకు సీఎం అయితే సంతోషిస్తాం'
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కొడుకు సీఎం అవుతాడంటే సంతోషిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడతూ వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు చాలా సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో వైయస్ కొడుకు జగన్పై మాకు అభిమానం ఉండటం సహజమని అన్నారు. మా కళ్ల ముందు తిరిగిన కుర్రాడు, వైయస్ కొడుకు సీఎం అవుతాడంటే ఆనందిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబుతో తమకెప్పుడూ స్నేహ సంబంధాలు లేవని, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్ద పరిచయం లేదని అన్నారు.
జగన్కు మేధోపరమైన సలహాలిచ్చేంత మేధస్సు తన వద్ద లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఇక హోదాపై చంద్రబాబు కన్నర్ర చేస్తే ప్రధాని మోడీ గీడీ ఎక్కడాగుతారంటూ ఎద్దేవా చేశారు. 'బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నాక మోడీ వీక్నెస్లో ఉన్నాడు. రేపు ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు వస్తున్నాయి.
'నీ సంగతి బయటపెడతాను, మోదీ ఏదీ చెప్పినా నమ్మకండి' అని ఈ ఎన్నికలప్పుడు వీడియో షోల ద్వారా చంద్రబాబు నాయుడు చెబితే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే, చంద్రబాబు నాయుడికి ఆ గ్లామర్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే చంద్రబాబుని మేధావిగా పేర్కొన్నారు.
చంద్రబాబు చాలా గొప్పవాడని, కంప్యూటర్ కనిపెట్టాడని, సింధుకు షటిల్ ఆడటం ఇతనే నేర్పాడని, ఇటువంటి వన్నీ వింటే మనకు నవ్వొస్తుంది కానీ, మిగతా దేశమంతా కూడా చంద్రబాబును నమ్ముతారని ఆయన అన్నారు. ఇదే హెచ్చరిక కనుక చంద్రబాబు చేస్తే ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని అన్నారు.
అయితే ఇదంతా తన ఊహ అని, చంద్రబాబు తలచుకుంటే ఇలాంటివి వంద ట్రిక్కులు చేయగలడని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆసక్తి లేదేమో నాకు అర్థం కావడం లేదని అన్నారు. త్వరలోనే అమరావతి నిజ స్వరూపాన్ని నేను బయటపెడతానని ఆయన అన్నారు.