ఏపీ ప్రజలపై ఎందుకంత కక్ష, మేమేం తప్పు చేశాం: బాబుపై ఉండవల్లి నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై ఏపీ ప్రజల్ని బీజేపీ మోసం చేసిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కమార్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేకహోదా సాధించకుండా ఇంకా ఎన్నాళ్లని కాంగ్రెస్పై విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా మన హక్కు అని చెప్పిన ఉండవల్లి ఆ హక్కుని సాధించడానికి చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తేనే రాయితీలు వస్తాయని అన్నారు.
అందుకే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలని అడుగుతున్నామని ఆయన అన్నారు. ఏపీకి హోదా ఎందుకు అమలు చేయడం లేదనే దానిపై బీజీపే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రజలపై ఎందుకంత కక్ష అంటూ బీజేపీపై మండిపడ్డారు.
ఏపీ విభజన జరిగిన సమయంలో మేమేం తప్పు చేశామని చంద్రబాబును నిలదీశారు. విభజన జరిగిన సమయంలో తామెవరం సభలో లేమని చెప్పిన ఉండవల్లి, తమను అన్యాయంగా బయటకు గెంటేసి, లోక్సభ తలుపులు మాసేని బిల్లు పాస్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విభజన వల్లే రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ రెండు శాతానికి పడిపోయిందని అన్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు వల్లే ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశంపై చర్చ జరిగిందని చెప్పారు. దానికి కాంగ్రెస్ పార్టీని సమర్ధించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటి వరకు ఏపీకి ఏం సాధించారని నిలదీశారు. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు ఆగస్టు 5న చర్చకు వస్తుందని, అప్పుడైనా బిల్లు పాస్ చేయించుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో శుక్రవారం సాయంత్రం జరిగిన చర్చలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అత్యంత ప్రమాదక మాటలు మాట్లాడారని అన్నారు.
పోలవరంపై ఒరిస్సా ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలో సుప్రీం కోర్టు తీర్పుని బట్టి మళ్లీ ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు. ఒక రకంగా చెప్పాలంటే జైట్లీ వ్యాఖ్యలు పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 25వేల కోట్లు అవసరమైతే కేంద్రం కేవలం 800 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.
పోలవరంపై ఇంత కుట్ర జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే 2 వేల టీఎంసీలను వాడుకోవచ్చని చెప్పిన ఆయన అవసరమైతే ఒరిస్సా వరకు కూడా నీటిని తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు.