నేను వస్తా, చెప్పండి: బాబుకు ఉండవల్లి లేఖ, రాజధానిపై మాట మార్చిన కెఈ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం నాడు లేఖ రాశారు. చర్చకు సిద్ధమన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
తనకు చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మీరు చెప్పిన సమయం, తేదీలలో తాను హాజరు అవుతానని చెప్పారు. ఎజెండాకు లోబడి తాను మాట్లాడుతానని చెప్పారు.
మాట మార్చిన కేఈ
భూసేకరణ విషయంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మాట మార్చారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణపై తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. నిన్న తానొకటి చెబితే, మీడియా ప్రజలకు మరో సందేశాన్ని పంపిందన్నారు.
మంత్రి నారాయణపై అసంతృప్తితో ఉన్నానని, తాను చెప్పలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. రైతులే స్వచ్ఛందంగా భూములిస్తారు, భూసేకరణ అవసరం ఉండదని మాత్రమే తాను చెప్పానన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించిన మంత్రి నారాయణను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు.
పట్టిసీమ ప్రాజెక్టుకు అడ్డుపడరాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. కాగా, భూసేకరణకు తాను వ్యతిరేకమని కేఈ కృష్ణమూర్తి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశార.
వెంకయ్య మాట మార్చారు: వాసిరెడ్డి పద్మ
ప్రత్యేక హోదా ఇవ్వాలని నాడు చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు మాట తప్పారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీకి హోదా రాకుంటే పరిశ్రమలు రావన్నారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.