తెలుగు రాష్ట్రాలకు కేంద్రమంత్రుల భరోసా, టీలో కృత్రిమ పోర్ట్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రమంత్రులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారిగా చేస్తామన్నారు.
విదర్భలోలా తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి లభ్యత ఎ్కువ లేనందువల్లే ఇలా జరుగుతోందన్నారు. తెలంగాణలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. త్వరలో కొత్త వాహన చట్టం అమలులోకి తెస్తామన్నారు. ప్రధాని జలమార్గ్ యోజన ద్వారా జల రవాణా మార్గాలను ప్రోత్సహిస్తామన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు జలమార్గాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తెలంగాణలో కృత్రిమ పోర్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రవాణా పన్ను తెలంగాణా ప్రభుత్వం పరిధిలోనిది అని చెప్పారు. ఆయన మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ - రాయచూర్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ సాగునీటి వసతి లేకపోవడమే రైతుల ఆత్మహత్యలకు కారణమని, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, దేవరాపల్లి రహదారులను నాలుగు లేన్ల రోడ్లుగా మార్చాలని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. మరోవైపు గడ్కరీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేఖ రాశారు. వరంగల్ - ఖమ్మం రోడ్డు మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చాలని కోరారు.
ఏపీపై వెంకయ్య హామీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని, విభజనతో అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం చెప్పారు. శ్రీ సిటీ సమీపంలో 70 ఏకరాల్లో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశామన్నారు. ఏర్పేడు మండలంలో 1200 కోట్ల రూపాయలతో ఐఐఎస్ఈఆర్ను ఏడేళ్లలో పూర్తి చేసేందుకు నిర్ణయించామన్నారు.
సమగ్ర భూగర్భ మురికి కాల్వ పథకం కింద విజయవాడకు రూ.461 కోట్లు కేటాయించామన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పైన అధ్యయనం బృందం నివేదిక ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. పోలవరానికి నిధుల విషయంలో ఒక అథారిటీ ఏర్పాటు చేయడంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ఆ తర్వాత గత ఏడాదికి రూ.260 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు.
ఏపీకి నిధుల కొరత ఉందనేది దృష్టిలో పెట్టుకుని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రూ.1000 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. నిరుద్యోగ యువకుల నైపుణ్య శిక్షణకు రూ.40 కోట్లు, విడుదల చేసినట్లు చెప్పారు. అనంతపురంలో కస్టమ్స్ శిక్షణ కేంద్రానికి ఈనెల 4న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేస్తారన్నారు.