యుపిలో డాడీ, సన్ మధ్య ఫైట్: నారా లోకేష్ సంచలన ప్రకటన
గుంటూరు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తండ్రీతనయులు ములాయం సింగ్ యాదవ్కు, అఖిలేష్ యాదవ్కు మధ్య జరుగుతున్న రాజకీయ సమరంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వారి మధ్య జరుగతున్న రాజకీయ సమరాన్ని గుర్తు చేస్తూ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాఠం నేర్పుతుందని అన్నారు.
గుంటూరు తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. మంత్రివర్గ స్థానాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తల్లీతండ్రుల మధ్య చిచ్చు పెట్టాయని ఆయన అన్నారు. నారా లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకుని, అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలక శాఖను ఆయనకు అప్పగించాలని కోరుతూ గుంటూరు పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు ఓ తీర్మానాన్ని సమావేశంలో ప్రతిపాదించారు.
ఆ తీర్మానం ప్రతిపాదించినప్పుడు నారా లోకేష్ ఆ వ్యాఖ్యలు చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చరుకుగా చేపట్టాలని, నవంబర్ 1వ తేదీ నుంచి జరిగే జనచైతన్య యాత్రలను విజయవంతం చేయాలని ఆయన కార్యక్రర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో అతి పెద్ద క్యాడర్ ఉన్న పార్టీల్లో టిడిపి ఒకటని ఆయన అన్నారు.
పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పడంలో నిజం లేదని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని కుల, మతాల ప్రాతిపదికపై విభజించాలని చూస్తోందని ఆయన విమర్శించారు.