విమానాల్లో వచ్చేసి లాడ్జిల్లో దిగుతారు: దోచేసి వెళ్లిపోతారు
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగల ముఠాను హైదరాబాద్ నేర పరిశోధక విభాగం పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగలు దర్జాగా విమానంలో వచ్చి, లాడ్జీల్లో బస చేస్తారు. తాళం వేసే ఉండే ఖరీదైన ఇళ్లను, దుకాణాలను లక్ష్యం చేసుకుని దోచుకుంటారు.
సొత్తును వెంటనే రైళ్లో తమ ప్రాంతానికి తరలిస్తారు. ఇలా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో దొంగతనాలు చేస్తున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందంటూ ఓ తెలుగు దినపత్రిక రాసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ముఠా ఉత్తర్ప్రదేశ్ పోలీసుల అండతో దేశాన్ని దోచేస్తున్నట్లు తెలిసింది. ఈ ముఠా ఢిల్లీ, ముంబాయ్, చెన్నై, కోల్కత్తా, తిరుపతి, విశాఖపట్నం లాంటి పట్టణాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం.
యూపీ ముఠాను పట్టుకోవడం కోసం సీసీఎస్ పోలీసులు రెండు నెలలు కష్ట్టపడాల్సి వచ్చింది. దొంగలను గుర్తించినా యూపీ పోలీసుల నుంచి సహకారం దొరకకపోవడంతో 25 రోజుల పాటు అక్కడే తిష్టవేసి ఎట్టకేలకు ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠా సభ్యులు దొంగతనం చేయాలనుకున్న నగరానికి యూపీ నుంచి విమానంలో వెళ్తారు. బొమ్మల వ్యాపారం చేయడానికి వచ్చామని పేర్కొంటూ స్థానికంగా ఉండే రైల్వేస్టేషన్ సమీపంలోని లాడ్జీలో బసచేస్తారు. పగటి వేళలో బొమ్మలు విక్రయించే నెపంతో బయటకు వెళ్లి ఖరీదైనా ఇళ్లు, దుకాణాలను ఎంచుకుంటారు. రాత్రి వేళలో తాళాలు పగలగొట్టి నిమిషాల్లో దొంగతనం చేసుకొని బయట పడుతారు.ఇలా దొంగతనం చేసిన సొత్తును ఎప్పటికప్పుడు తమ స్వస్థలాలకు ముఠాలోని సభ్యులతో పంపిస్తారు. కాగా, సెల్ఫోన్స్ సిగ్నల్స్ ఆధారంగా దొరకకుండా తమ సెల్లను లాడ్జి వద్దే ఉంచుతారు.
ఇలా హైదరాబాద్లో రెండు మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. ఒక దొంగతనం కేసులో సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సీసీఎస్ పోలీసులు ఈ ముఠాను గుర్తించారు. పక్కా ఆధారాలతో యూపీకి వెళ్లినా అక్కడి పోలీసులు సహకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.