హుదూద్: బాబుపై విహెచ్ ప్రశంసలు, ప్రజల్లో మార్పు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. హుదూద్ తుపాను సహాయక చర్యలను చంద్రబాబు సమర్థవంతంగా చేపడుతున్నారని కొనియాడారు.
చంద్రబాబు ముందస్తు జాగ్రత్తల వల్లే ప్రాణ నష్టం భారీగా తగ్గిందని అన్నారు. విశాఖపట్నంవలోని హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకే తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చారని... ఆయన పర్యటను రాజకీయం చేయవద్దని కోరారు.
మహారాష్ట్ర, హర్యానాల్లో వెలువడుతున్న ఫలితాలపై స్పందిస్తూ... ఈ రెండు రాష్ట్రాల్లో పదేళ్లకు పైగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు. అక్కడి ప్రజలు మార్పును కోరుకున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీపై వారికి వ్యతిరేకత లేదని అన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చూద్దామని ఓటర్లు భావించారని చెప్పారు. కొత్తగా పెళ్లయిన వాడు సాయంత్రం 8 గంటలకే ఇంటికి వెళతాడని... ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నెమ్మదిగా వెళతాడని... ఇదీ అంతేనని ఉదాహరణగా చెప్పారు.
హుదూద్ తుఫాన్ తీవ్రతకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం విశాఖకు వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులకో మాట్లాడిన రాహుల్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంలో రాహుల్ మాట్లాడుతూ విశాఖ వాసుల కష్టాలు స్వయంగా చూసేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. స్టీల్ ప్లాంట్కు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేలా పోరాడుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.