కేశినేని నాని క్షమాపణ చెప్పాల్సిందే: వంగవీటి రాధా, బెజవాడ బంద్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో విజయవాడలో జన జీవనాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.
నగరంలో రోడ్ల విస్తరణ పేరిట ఇటీవల అధికారులు పలు పురాతన ఆలయాలను తొలగించారు. అంతేగాక, అధికారులను అడ్డుకున్న గోశాల నిర్వాహకులపై ఎంపీ హోదాలో ఉన్న నాని దుర్భాషలాడారనే ఆరోపణలు వచ్చాయి. 'అభివృద్ధిని అడ్డుకుంటారా?... ఎవడ్రా వీడు.. వీరి ఓట్లు మనకవసం లేదు' అని నాని దుర్భాషలాడినట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, హిందూ పరిరక్షణ సమితిలు నాని వైఖరికి నిరసనగా బుధవారం బెజవాడ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా మంగళవారం వంగవీటి రాధ మాట్లాడుతూ.. నాని క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఆలయాల ధ్వంసంపై ప్రజాగ్రం
అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశఆరు. మందపల్లి తరువాత అంతటి చరిత్ర గల శనీశ్వరస్వామి ఆలయాన్ని, 90 ఏళ్ల నాటి దక్షిణముఖ ఆంజనేయస్వామి గుడిని, భవానీపురంలోని స్వయంభు అమ్మవారి ఆలయాన్ని అధికారులు ఇటీవలే ధ్వంసం చేశారు. సీతమ్మవారి పాదాలను పెకలించారు.
రోడ్ల విస్తరణ, సుందరీకరణ పేరుతో అడ్డగోలుగా ఆలయాలు, మసీదులు, చర్చిలను కూలగొడుతున్నారు. భవానీపురం, వన్టౌన్, రామవరప్పాడు, గవర్నర్పేట, కృష్ణలంక, సింగ్నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 44 ఆలయాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాలను సాకుగా చూపి అడ్డగోలుగా ప్రార్థనాలయాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడుతున్నారు.
చారిత్రక ప్రాశస్త్యం గల ప్రార్థనాలయాలను కూల్చివేయాల్సి వస్తే ముందుగా నోటీసులు ఇచ్చి, ప్రత్యామ్నాయ స్థలాలను చూపాల్సిన బాధ్యతను మాత్రం అధికారులు విస్మరిస్తున్నారు. తాజాగా కెనాల్రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు.