బజారు రౌడీ: కెసిఆర్పై వర్ల, విపరీత బుద్ధన్న పరకాల
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక రాష్ర్టానికి సిఎంగా ఉన్న కె చంద్రశేఖర్ రావు బజారు రౌడీలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక సీఎం మరో సీఎంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానన్నది చంద్రబాబా, కేసీఆరా అని ఆయన నిలదీశారు.
ఉద్యమం కోసం ఉస్మానియా విద్యార్థులను వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత లాఠీచార్జీలు చేయించారని విమర్శించారు. కేసీఆర్ మాట తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని వర్ల రామయ్య హెచ్చరించారు.
మభ్యపెడుతున్నారు: కెసిఆర్పై పరకాల
హైదరాబాద్: కృష్ణా నది బోర్డు వద్ద అన్ని జీవోలు పాటిస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒప్పుకున్నాయని ఏపి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. శనివారం ఏపి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సిఎం కెసిఆర్ విపరీత బుద్ధిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు ప్రజలను కెసిఆర్ మభ్యపెడుతున్నారని పరకాల ప్రభాకర్ దుయ్యబట్టారు. కెసిఆర్ తన హోదాకు తగినట్లుగా మాట్లాడటం లేదని ఆయన ఆరోపించారు. 107 జీవో విడుదల చేసినప్పుడు హరీశ్ రావు మంత్రివర్గంలో ఉన్నారని పరకాల ప్రభకార్ గుర్తు చేశారు.