అవేమయ్యాయి: చంద్రబాబుపై విరుచుకుపడిన వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసిన మొదటి ఐదు సంతకాల విషయం ఏమైందని ఆమె అడిగారు.
మద్యం వ్యాపారం చేయాలని అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనలు దుర్మార్గమని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. న్నికలకు ముందు మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మార్చారని ఆమె అడిగారు.
బెల్టు షాపులను రద్దు చేస్తున్నట్లు జీవో ఇచ్చారని, అయితే ఇప్పటికీ ఒక్క బెల్టు షాపు కూడా రద్దు కాలేదని పద్మ అన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని, ప్రభుత్వమే సమీక్షలు నర్వహించి మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం అత్యంత దారుణమని ఆమె అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్టు షాపులు అన్న పదమే మర్చిపోయారని ఆమె అన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారికి క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.