పిల్ల టిడిపి: రాహుల్కు వాసిరెడ్డి ప్రశ్నల వర్షం, దాశరథిపై చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నాడు మండిపడింది. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి మరో పిల్ల టిడిపిగా మారిపోయిందని ధ్వజమెత్తింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ బుధవారం నాడు రాహుల్ గాంధీ పర్యటన పైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పైన కక్ష కట్టిందని ఆరోపించారు. మరో పిల్ల టిడిపిగా కాంగ్రెస్ బతకాల్సిందే అన్నారు.
తమ పార్టీని సూటిగా ఎదుర్కోలేకనే టిడిపితో చేతులు కలిపి జగన్ పైన అక్రమ కేసులు పెట్టించిందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరును కూడా ఛార్జీషీటులో పెట్టేందుకు వెనుకాడలేదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ పలు ప్రశ్నలు సంధించారు. రాహుల్ ఏ ముఖం పెట్టుకొని వైయస్ విగ్రహానికి పూలమాల వేస్తారు, వైయస్ కుటుంబంపై కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరించిన విషయం మర్చిపోయారా, వైయస్ పేరును ఛార్జీషీటులో చేర్చిన విషయం మారిపోయారా, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణం మీరు కాదా, కాంగ్రెస్ ఓటు బ్యాంకును టిడిపికి మళ్లించిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు.
తెలుగుజాతి ముద్దుబిడ్డ దాశరథి: చంద్రబాబు
ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు తెలుగుజాతి ముద్దుబిడ్డ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు.
దాశరథి జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకున్నారు. నా తెలంగాణ కోటి రత్నాలవీణ అన్న దాశరథి వ్యాఖ్యలు నేటికీ సజీవమన్నారు. నిజాం దుష్పరిపాలన, రజాకారుల దుర్మార్గాలను దాశరథి తన కవిత్వంలో ఎండగట్టారని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.