అబద్దాలతోనే ఏడాది ప్రారంభం: బాబుపై వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను వంచించే ప్రయత్నం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. గురువారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సరం మొదటి రోజున ఏపీ ప్రభుత్వం ప్రకటన రూపంలో ప్రచురించిన చంద్రబాబు లేఖ నిండా అబద్ధాలే ఉన్నాయన్నారు.
తొలి రోజున ఏ పని చేస్తే ఏడాది మొత్తం అదే విధంగా గడుపుతామనే నమ్మకంతో అందరూ ఉంటారన్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం అదేమీ పట్టించుకోకుండా తొలి రోజునే కన్నార్పకుండా అబద్ధాలు చెప్పారంటే.. ఇక 2015 మొత్తం ఆయన తీరు ఎలా ఉండబోతోందో అర్థం అవుతోందని ఆమె విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో ‘మన గుండెల్లో కరకు కత్తులు దించారంటూ' చంద్రబాబు చెప్పడాన్ని పద్మ తీవ్రంగా తప్పు పట్టారు.
ఆ కత్తిని పట్టుకోవడంలో చంద్రబాబుకూ పాత్ర ఉందన్నారు. పార్లమెంటులో తెలంగాణ కోసం తొలుత ఓటేసింది తామేనంటూ ఆ పార్టీ అప్పటి ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పిన మాటలు గుర్తు లేవా? విభజన తరువాత అదే నామాను ఆంధ్రప్రదేశ్లోని చక్కెర ఫ్యాక్టరీల స్థితిగతుల అధ్యయన కమిటీలో సభ్యునిగా నియమించింది చంద్రబాబు కాదా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు.
బాబు పాలన గొప్పేంటో చెబుతారా..
విభజన వల్ల కట్టుబట్టలతో బయటకు వచ్చామని, రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఏర్పడిందని తన లేఖలో పేర్కొన్న చంద్రబాబుకు, తన పార్టీ ఎంపీల చేత తెలంగాణకు అనుకూలంగా ఓట్లేయించినపుడు ఆ విషయం తెలియదా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి రోజు చేసిన ఐదు సంతకాల అమలుకు దిక్కు లేకుండా పోయాయన్నారు. అణా పైసలతో సహా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇపుడు ఉపశమనం కల్పిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల పాలన అస్తవ్యస్తంగా ఉందన్న బాబు.. తన పాలనను మాత్రం పొగుడుకున్నారని, ఆయన పాలన ఏ రంగంలో బ్రహ్మాండంగా ఉండేదో గణాంకాలతో సహా వివరించగలరా? అని ఆమె సవాలు విసిరారు.
35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు.. పాదయాత్ర చేసినపుడే తనకు ప్రజల సమస్యలు తెలిశాయని చెప్పుకోవడం చూస్తే అంతకు ముందంతా ఆయనకు తెలిసింది శూన్యమనేగా అర్థం అని ఆమె ఎగతాళి చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు అబద్ధాలు మాని ఐదు సంతకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో సుత్తి లేకుండా సూటిగా చెప్పాలన్నారు. చంద్రబాబు పాలనలో ఇక ప్రజలపై అన్ని రకాలుగా బాదుడే ఉంటుందని విద్యుత్ చార్జీల మొదలు అన్నీ పెరుగుతాయని పద్మ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.