ప్రత్యేక హోదాతో సమస్యలు తీరవు: తేల్చేసిన వెంకయ్య
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు తేల్చేశారు. ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు తీరవని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాకు మించి ఏపీకి అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
నెల్లూరు జిల్లా పొదలకూరులో 30 పడకల ఆసుపత్రి భవనాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి పంచాయితీ వరకు కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఇండియా శక్తివంతంగా ముందుకు వెళుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా ప్రాజెక్టులు ముఖ్యమని ఆయన అన్నారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించినా కూడా అవి ఆర్థిక వెనుకబడి ప్రాజెక్టుల కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాయని ఆయన చెప్పారు దేశంలో ఆర్థిక స్వావలంబన సృష్టించి సంపదను ప్రజలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు
ఇదిలావుంటే, ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం ప్రత్యేక హోదా సాధన కమిటీ నెలరోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 8 నుంచి 20 వరకు మండల, గ్రామస్థాయిలో సభలు నిర్వహించి పాదయాత్ర లు చేయాలని నిర్ణయించినట్లు కమిటీ నేత చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 20న గుంటూరులో రాజకీయాలకు అతీతంగా బహిరంగసభ ఏర్పాటు చేస్తామన్నారు.