అభిమానమా? దురభిమానమా?: మోడీకి పోటీపై వెంకయ్య ఉద్వేగం, ‘బాబంటే ఇష్టం’
దేశం ముందుకెళ్లాలంటే సరైన నాయకత్వం కావాలి.. ఇప్పుడు మనదేశానికి అలాంటి నాయకత్వమే ప్రధాని నరేంద్ర మోడీ రూపంలో ఉందని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు.
విజయవాడ: దేశం ముందుకెళ్లాలంటే సరైన నాయకత్వం కావాలి.. ఇప్పుడు మనదేశానికి అలాంటి నాయకత్వమే ప్రధాని నరేంద్ర మోడీ రూపంలో ఉందని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. 2019లో ప్రధాని పదవికి తాను పోటీ వస్తాననే.. తనను తప్పించారనడం సరికాదని అన్నారు.
అభిమానమా? దురాభిమానమా?
ఇలాంటి ప్రచారం తనపై అభిమానంతో చేస్తున్నారో.. లేక దురాభిమానంతో చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. 2019లోనూ నరేంద్ర మోడీ ప్రధాని కావాలనేదే తన కోరిక అని వెంకయ్య అన్నారు. తాను 2020లో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. మోడీ రెండో సారి ప్రధాని అయ్యేంత వరకూ ఉండకుండా పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని తనకు చాలా బాధకలిగిందని అన్నారు.
ప్రపంచానికి చాటిచెప్పారు..
భారత శక్తి ఏమిటో ప్రధాని మోడీ ప్రపంచానికి తెలియజెప్పారని అన్నారు. విజయవాడలో వెంకయ్యనాయుడుకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దీర్ఘకాలిక సుఖాల కోసం స్వల్పకాలిక కష్టాలు తప్పవన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేవేనని స్పష్టం చేశారు.
ఎదగాలంటే.. క్రమశిక్షణ అవసరం
తాను రైతు కుటుంబంలో పుట్టానని తెలిపారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి క్రమశిక్షణ అవసరమని చెప్పారు. గతంలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి విడిపోయారు.. మళ్లీ వచ్చారని చెప్పారు. ఇప్పుడు కూడా బీహార్ సీఎం గతంలో విడిపోయారు.. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ గూటికి చేరుకున్నారని తెలిపారు. విమర్శించినంత మాత్రాన వారిని వద్దనుకుంటామా? అని ప్రశ్నించారు. తమ కుటుంబంలో గాంధీలు, నెహ్రూలు లేరని చెప్పారు.
బాబంటే ఇష్టం..
తనకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అంటే ఎంతో ఇష్టమని, అభిమానమని వెంకయ్యనాయుడు చెప్పారు. ఎందుకంటే... చంద్రబాబునాయుడు అభివృద్ధిని కోరుకుంటారని, ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి గురించే ఆలోచిస్తాడని అన్నారు. అందుకే తనకు చంద్రబాబు అంటే చాలా అభిమానమని చెప్పారు.
వాస్తవం లేదు..
చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగానని చెప్పారు. ఎంతో కష్టపడి చదివి.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగానని వెంకయ్య అన్నారు. తన కుమారుడు, కుమార్తె, అల్లుడి వ్యాపారంలో తాను జోక్యం చేసుకోలేదని.. స్వర్ణభారత్ ట్రస్టు ప్రభుత్వం నుంచి ఎప్పుడూ నిధులు తీసుకోలేదని చెప్పారు. కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంకయ్య కొడుకు కంపెనీ, కూతురు సంస్థ బహుమానాలు పొందారని ఇటీవల కాంగ్రెస్ నేత జైరాం చేసిన ఆరోపణలో నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్వేగానికి లోనైన వెంకయ్య..
తనను అంతగా ప్రేమించి.. ప్రోత్సహించి అంత పైకి తీసుకొచ్చి.. తనకు చెప్పలేనంత సహాయం చేసిన తన పార్టీ ఆఫీసుకి తాను ఇకపై రాకూడదా?.. అని ఆవేదన కలిగిందని వెంకయ్య అన్నారు. అవతలి వారెవరైనా ఏదైనా విమర్శ చేస్తే ధీటుగా ప్రతి విమర్శ చేసే వాడినని అవన్నీ తనకు ఇక ఉండవేమోనని చాలా ఉద్వేగానికి లోనయ్యానన్నారు. అదుపు చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని.. అరుణ్ జైట్లీ, అనంతకుమార్ వచ్చి తనను ఓదార్చారన్నారు. తాను ఆ విధంగా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రధాని కూడా ఖిన్నుడయ్యారని వెంకయ్య తెలిపారు.