'హోదాలో ఏ1 నిందితుడు': నాడు కార్నర్ చేసి, నేడు బుక్కైన వెంకయ్య
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు ఏ1 ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. వెంకయ్య నిజాయితీ గురించి ఆంధ్రా ప్రజలకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని చెప్పారు. అలాగే విశ్వవిద్యాలయాలలో ప్రస్తుత పరిస్థితులకు భారతీయ జనతా పార్టీయే కారణమని ఒప్పుకునే ధైర్యం వెంకయ్యకు ఉందా అని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు.
ఏపీ నుంచి రాజ్యసభకు వెంకయ్య నో చెప్పారా, అందుకేనా?
కాగా, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు.. సభలో విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిన విషయం తెలిసిందే. ఏపీకి అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి యూపీఏ ప్రభుత్వం చెబితే, వెంకయ్య పదేళ్ల కోసం పట్టుబట్టారు.
అయితే, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు. ఇప్పుడు ఏకంగా, ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రమంత్రులు వరుసగా చెబుతున్నారు. దీంతో విపక్షాలు బిజెపిని తప్పుపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ నేత అయిన, పదేళ్లు హోదా కోసం పట్టుబట్టిన వెంకయ్య టార్గెట్ అయ్యారు.