కొత్త కోణం: వెంకయ్య నాయుడు బిజెపిలో చంద్రబాబు మనిషి?
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై తీవ్రమైన వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడి విషయంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. వెంకయ్య నాయుడు బిజెపిలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శించింది.
వెంకయ్య నాయుడు పదే పదే చంద్రబాబును ప్రశంసిస్తూ ఎపికి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో అంటున్నారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి బుధవారంనాడు అన్నారు.
తెనాలి సభలో వెంకయ్య నాయుడు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై చేసిన వ్యాఖ్యలపై కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. వెంకయ్య నాయుడు బిజెపిలో టిడిపి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాడుతుంటే ప్రత్యేక కన్నా ప్యాకేజీ వల్లనే ఎక్కువ లాభమంటూ చంద్రబాబు, వెంకయ్యయ నాయుడు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య, చంద్రబాబు అవిభక్త కవలలని, వారి శరీరాలు వేరైనా వారు ఆడే అబద్ధాలు ఒక్కటేనని ఆయన అన్నారు .