మీ నిధిని ఖర్చు పెట్టండి, ఆపై మేమిస్తాం: ఇద్దరు చంద్రులకు వెంకయ్య సూచన
హైదరాబాద్: కేంద్రం నుంచి వచ్చే సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్రాల వద్ద ఉన్న విపత్తు నిధి నుంచి డబ్బు ఖర్చు చేసి వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సలహా ఇచ్చారు. గడచిన పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని వర్ష ప్రభావితంపై కేంద్ర ఆర్ధిక, హోం, వ్యవసాయ మంత్రులతో వెంకయ్య నాయుడు బుధవారం సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించారు. మంగళవారం వెంకయ్య గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంటలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సంగతి తెలిసిందే.
బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్రం తన నిధులను ఖర్చు పెట్టాలని సీఎంలకు సలహా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బృందాలను పంపాలని తాను కోరానని చెప్పారు. రైతులను త్వరగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రులను కోరినట్లు ఆయన తెలిపారు.
దీనిపై స్పందించిన మంత్రులు రెండు రాష్ట్రాలూ పంట నష్టం అంచనాలను పంపిన తరువాత అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని కేంద్రమంత్రులు తెలిపారని అన్నారు. కేంద్రం నిధులు వచ్చేలోగా ప్రభుత్వం వద్ద ఉన్న నిధులను ఖర్చు చేయాలని సలహా సూచించారు. ఆ తర్వాత కేంద్రం నిధులను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.