సన్మానంలో పవన్పై వెంకయ్య ఆగ్రహం, '23 ని.ల్లో విభజన..' బీజేపీకే రివర్స్!
తెనాలి: కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మంగళవారం నాడు మరోసారి కౌంటర్ ఇచ్చారు. రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కాకినాడ సభలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు.
వెంకయ్య కూడా ఒకటి రెండుసార్లు దీనిపై స్పందించారు. తాజాగా, మంగళవారం తెనాలిలో ఏర్పాటు చేసిన తన సన్మాన సభలో మరోసారి పాచిపోయిన లడ్డూల పైన మాట్లాడారు. లడ్డూలు పాచిపోవచ్చు కానీ డబ్బులు పాచిపోవని ఎద్దేవా చేశారు.
కొందరు అలా అంటున్నారు
కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన డబ్బుని కొందరు పాచిపోయిన డబ్బు అంటున్నారని, ఏవేవో మాట్లాడుతున్నారని, హోదా అనే ఒక పదాన్ని పట్టుకొని తమకు అదే కావాలని మాట్లాడుతున్నారని, హోదాకు తగిన విధంగానే ప్రత్యేక సాయం అందిస్తామని చెప్పిన విమర్శలు చేయడం సరికాదన్నారు.
రుణాలు కేంద్రమే కడుతుంది
కేంద్రం విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని, ఆ డబ్బంతా తిరిగి కేంద్రమే కడుతుందనని స్పష్టంగా చెప్పిందన్నారు. మాకు అవన్నీ వద్దని, హోదానే కావాలని మాట్లాడటం విడ్డూరమన్నారు. పోలవరానికి అవసరమయ్యే నిధులు 60 శాతం రాష్ట్రం, 40 శాతం కేంద్ర పెట్టుకోవాలని, హోదా వస్తే 90 శాతం కేంద్రం భరిస్తుందని, కానీ ప్రత్యేక సాయాన్ని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు పోలవరానికి అవసరమయ్యే వంద శాతం నిధులని ఖర్చు చేస్తుందని వెంకయ్య అన్నారు.
హోదా అడిగింది నేనే అంగీకరిస్తున్నా..
విభజన సమయంలో నాడు రాష్ట్ర ప్రయోజనాలపై నోరు మెదపని వారు ఈరోజు తనను విమర్శిస్తున్నారని వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. ఆదాయం లేకపోతే ఏపీ వెనుకబడి పోతుందని విభజన సమయంలో తాను రాజ్యసభలో చెప్పానన్నారు. ప్రత్యేక హోదా కావాలని అడిగింది నేనే.. ఒప్పుకుంటున్నానని, అదే సమయంలో తాము డిమాండ్ చేసినవి నాటి ప్రభుత్వం చేయలేదని, అలాగే ఇప్పుడు ఏపీకి న్యాయం కోసం చూస్తున్నామన్నారు.
రెండేళ్లలో ఎన్నో చేశాం
తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎన్నో చేశామన్నారు. అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణానికి తెలంగాణ అడ్డుపడే అవకాశం ఉన్నందునే ఆ రాష్ట్రంలోని ముంపు మండలాలను ఏపీలో కలిసేలా తాను చొరవ తీసుకున్నట్లు తెలిపారు. విభజన హామీలపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆనాడు పార్లమెంటులో ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చేయలేనిది మేం చేశాం
కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో చేస్తామని ఇచ్చిన హామీలను తాము రెండేళ్లలోనే చాలావరకు చేయడం ఇష్టం లేకే వారు విమర్శలు చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలు ఏపీలో నెలకొల్పేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే అనేక సంస్థలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం ఏ హామీపైనా స్పష్టం ఇవ్వకపోవడం వల్లనే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.
కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నారుగా
2004లోనే రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పి తెరాసతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల సమయం ఎందుకు తీసుకుందో చెప్పాలన్నారు. ఆ సమయంలో ఏపీకి ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలన్నారు. హోదా అంశాన్ని చట్టంలో పొందుపరిస్తే కచ్చితంగా అమలుచేసే వాళ్లమని, కాంగ్రెస్ ప్రభుత్వం తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బురద జల్లుతోందన్నారు.
'23 నిమిషాల'తో చిక్కుల్లో పడ్డ వెంకయ్య!
కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తలుపులు మూసి 23 నిమిషాల్లో విభజన చేశారని వ్యాఖ్యానించారు. ఇవి బీజేపీకే ఎదురు తిరుగుతాయని అంటున్నారు. అదే లోకసభలో అదే బిల్లుకు బీజేపీ మద్దతు పలికిన విషయం గుర్తుంచుకోవాలని అంటున్నారు.