ఏపీకి బిల్లులో లేనివి కూడా, ముస్లీంలు మనవాళ్లే కానీ వారిని ఒంటరి చేయాలి: వెంకయ్య
ఏపీకి బిల్లులో ఉన్న అంశాలు, లేని అంశాలు అన్ని కూడా ఇస్తున్నామని, ఈ మూడేళ్ల కాలంలో ఏ రాష్ట్రానికి చేయని సాయాన్ని ఏపీకి చేశామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం అన్నారు.
విజయవాడ: ఏపీకి బిల్లులో ఉన్న అంశాలు, లేని అంశాలు అన్ని కూడా ఇస్తున్నామని, ఈ మూడేళ్ల కాలంలో ఏ రాష్ట్రానికి చేయని సాయాన్ని ఏపీకి చేశామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
ఇంత తక్కువ సమయంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చామని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దీనిని అందరూ గుర్తించాలని అభిప్రాయపడ్డారు. బిజెపి సిద్ధాంతం కోసం పని చేసే పార్టీ అన్నారు.
పార్టీలు మారడం మన విధానం కాదు
పార్టీలు మారడం మన విధానం కాదని, అవినీతిపరుల భరతం పట్టడం మన విధానం అని వెంకయ్య అన్నారు. మోడీ నిద్రపోడు, ఇతరులను నిద్రపోనివ్వడన్నారు. మోడీ అరివీర భయంకరుడన్నారు. మూడేళ్ల పాలనలో కేంద్రంపై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం ఎక్కడ ఉందన్నారు.
మైనార్టీలకు వ్యతిరేకమని ప్రచారం
బిజెపి అంటే ముస్లీంలకు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు. ప్రతి ముస్లీం, ప్రతి క్రైస్తవుడు మన వాడే అన్నారు. ఇక్కడ ఉండి, ఈ దేశాన్ని పరిపాలించే వారు మనవాళ్లే అన్నారు.
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు
కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్నీ కుంభకోణాలే అన్నారు. ఆకాశంలో అగస్డా స్కాం, భూమిలో బొగ్గు స్కాం, గాలిలో 2జీ కుంభకోణం అని వెంకయ్య విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే మోడీ భారత్ను ఓ స్థాయిలో నిలిపారన్నారు.
కాంగ్రెస్ పార్టీది రాద్దాంతం అని, మనది సిద్ధాంతమన్నారు. మనది సర్వమన సమానత్వమని, వారివి విభజన రాజకీయాలు అన్నారు. మనది నీతివంతమైన పాలన అని, వారిది అవినీతి పాలన అని వెంకయ్య అన్నారు. దేశం ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు.
మోడీని ఎదుర్కొనే ధైర్యం లేదు
తెలంగాణలో, ఏపీలో, ఉత్తర ప్రదేశ్లో మోడీ అనే నినాదాలు రావడం సహజమని, కానీ అమెరికా, చైనా, జపాన్ ఎక్కడకు వెళ్లినా ఆ నినాదాలు వినిపిస్తాయన్నారు. అది మోడీ అంటే అన్నారు. మోడీ పాలన మరో పదేళ్లు కొనసాగాాలన్నారు.
మోడీని ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదని వెంకయ్య అన్నారు. అందుకే తప్పుడు రాతలు, ప్రసంగాలు చేస్తున్నారన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
ఇంటింటికి వెళ్లండి
మనం ఇంటింటికి వెళ్లి మన సిద్ధాంతాలు ప్రచారం చేయాలనన్నారు. మన ప్రచారం ఇతర పార్టీలకు వ్యతిరేకం కాదన్నారు. మనది అన్ని ప్రాంతాలకు, అన్ని రకాల ప్రజలకు వర్తించేలా ఉంటుందన్నారు.
అఫ్జల్ గురు, యాకుబ్ మెమెన్లకు వత్తాసుపలికే విధ్వంసకారులను ఏకాకిని చేయాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. భారత్ మాతాకి జై అంటే చిత్రపటానికి కాదని, 130 కోట్ల మందికి జై అని అర్థమన్నారు. దేశంపై ప్రేమ ఉన్న వాళ్లంతా మన వాల్లే అన్నారు.
ప్రదర్శనలు, నిరసనలతో మన పార్టీ బలపడదన్నారు. ఇంటింటికి వెళ్లాలని, రాత్రింబవళ్లు కష్టపడాలన్్నారు. మన సిద్ధాంతాలు ప్రచారం చేయాలన్నారు.
ఇతర పార్టీలు అన్నీ చీలిపోయాయని తివారి కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్.. ఇలా చీలిపోయాయన్నారు. బిజెపి మాత్రం అంతటా దూసుకు వెళ్తోందని, అందుకు మన సిద్ధాంతాలు కారణమన్నారు. బిజెపికి సిద్ధాంతాలు శ్రీరామ రక్ష అని, ఎవరూ ఆపలేరన్నారు.