ఏపీపై ప్రత్యేక దృష్టి, మాది పూచీ: వెంకయ్య, ఇదిగో ఇవన్నిచ్చాం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని, విభజనతో అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో చెప్పారు.
విభజన సందర్భంగా ఏపీకి న్యాయం జరగలేదని, ఆ ప్రాంత సమస్యలు తెలుసుకోకుండా విభజన జరిగిందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఏర్పడిన బీజేపీ లేదా ఎన్డీయే ఆంధ్రకు తగిన న్యాయం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించిందన్నారు.
అన్నింటిని దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అవరోధాలు తొలగిపోయాయన్నారు. పోలవరంపై నిర్ణయం తీసుకోవడం కేంద్రం చేసిన మొట్టమొదటి పని అన్నారు. గత ఏడాదికి సంబంధించిన నిధులు విడుదల చేశామన్నారు.
పట్టణాభివృద్ధి శాఖ ద్వారా రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. ఇందుకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు. విభజన సమయంలో ఏపీకి న్యాయం జరగలేదని, ఎన్డీయే న్యాయం చేస్తుందన్నారు. ఓ ప్రాంతానికి న్యాయం జరగకుండా విభజన జరిగిందన్నారు.
విజయవాడ, గుంటూరు నగరాలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని, ఇందుకు సంతోషమన్నారు. 2013-15 మధ్య ఇరు రాష్ట్రాలు పెద్దగా అభివృద్ధి సాధించలేకపోయాయన్నారు. విద్య, వైద్య, శిక్షణ, సాంకేతిక సంస్థలు హైదరాబాదుకే పరిమితమయ్యాయనేది వాస్తవమన్నారు. ఏపీలోను ఇలాంటి సంస్థలకు ఇటీవలె శంకుస్థాపన చేశామన్నారు.
శ్రీ సిటీ సమీపంలో 70 ఏకరాల్లో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశామన్నారు. రాబోయే ఐదేళ్లలో ఏర్పేడు మండలంలో ఐఐటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. ఏర్పేడు మండలంలో 1200 కోట్ల రూపాయలతో ఐఐఎస్ఈఆర్ను ఏడేళ్లలో పూర్తి చేసేందుకు నిర్ణయించామన్నారు.
విద్యా సంస్థల స్థల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్నారు. విశాఖకు 1117, తిరుపతికి 816 గృహాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. సమగ్ర భూగర్భ మురికి కాల్వ పథకం కింద విజయవాడకు రూ.461 కోట్లు కేటాయించామన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ పైన అధ్యయనం బృందం నివేదిక ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. దీనిపై కేంద్రం హామీ ఇస్తుందన్నారు. విజయవాడ, గుంటూరులలో ముఖ్య సమస్యలను గుర్తించామన్నారు. మార్చి 31వ తేదీలోగా నిధులు రాష్ట్రాలకు చేరేలా చేశామన్నారు. గతేడాది రూ.250 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.