రాజధాని నిర్మాణానికి విధానముంది, నేను రూ.1000 కోట్లిచ్చా: వెంకయ్య
హైదరాబాద్: కొత్త రాజధానుల నిర్మాణానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయని, అంతకంటే మెరుగ్గానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. ఏపీ రాజధాని కోసం తన శాఖ నుండి రూ.1000 కోట్లు కేటాయించానని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనగురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తే, తాము నిలబెడుతున్నామన్నారు. మోడీ ఏడాది పాలన సంతృప్తికరంగా ఉందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నామని, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకెళ్తున్నామన్నారు. సామర్థ్యాన్ని అహంకారమని విపక్షాలు అంటున్నాయని మండిపడ్డారు. పట్టణాలు పేదలకు అనుకూలంగా లేవన్న ఆయన పేదలకు ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
పేదల జీవితాలను మెరుగుపర్చడమే తమ లక్ష్యమని వెంకయ్య స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. మోడీ ప్రతీ అడుగూ పేదరికం నిర్మూలన వైపే అన్నారు.
పేదలకు ఉపాధి శిక్షణ, ఇళ్ల నిర్మాణం, స్మార్ట్ సిటీల పథకాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మన దేశం పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తేనే స్వర్ణ భారతం సాధ్యమవుతుందన్నారు. 2020 నాటికి ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.