కెవిపి పెత్తనమేనా: పొన్నాలపై విహెచ్ ఫైర్, దిగ్విజయ్పైనా..
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు పార్టీలో అంతర్గత తగాదాలు మరోసారి వీధికెక్కాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపైనే కాకుండా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్పైనా రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపితో కాంగ్రెసుకు పొత్తు కుదిరిందేమోననే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి పొన్నాల లక్ష్మయ్య హాజరు కావడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ స్వయంగా ఉద్యమాలు చేయలేదా అని ఆయన అడిగారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ హైదరాబాదులో ఉండగా, టిడిపి ధర్నాకు వెళ్లడమేమిటని ఆయన అడిగారు.
పార్టీ నాశనం కావడానికి సీనియర్లే కారణమని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికీ కేవీపీ(కేవీపీ రామచంద్రరావు) పెత్తనమే నడుస్తున్నదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న దామోదర రాజనర్సింహా ఎక్కడైనా ప్రచారం చేసిండా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంపీల పాత్రే కీలకమని, కానీ ఇప్పుడు వాళ్లనే విస్మరిస్తున్నారని విమర్శించారు.
సమన్వయ కమిటీలో ఎంపీలు పనికి రారా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న వాళ్ల నాయకత్వంలోనే ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని, మళ్లీ వాళ్లే సమన్వయ కమిటీలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. అన్ని అంశాలు సమన్వయ కమిటీలోనే చర్చిస్తున్నామని చెప్తున్న నేతలు చర్చించినంక ఫలితం ఏమొస్తుందన్నది కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.
పొన్నాల, దానం స్టోరీ ఇదీ..
పార్టీ కార్యదర్శులను పక్కనపెట్టి సమన్వయ కమిటీకి బాధ్యతలు అప్పగించడమేమిటని కూడా విహెచ్ ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్పైనా ఆయన విరుచుకుపడ్డారు. సమస్యలు చెప్తే వింటారనే తప్ప దిగ్వజయ్ సింగ్ చర్యలు తీసుకోరని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు వచ్చి పార్టీని చెడగొడుతున్నారని ఆయన విమర్శించారు.
ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే గురువారం గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి ప్రభుత్వం పైన ఫిర్యాదు చేశారు. ఈ భేటీలో మాజీ మంత్రి దానం నాగేందర్ లేరు. దానం గైర్హాజరుపై టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డిలు మాట్లాడారు. ఆయన కాంటాక్టులో లేరని చెప్పారు. వారి వ్యాఖ్యల పట్ల దానం మండిపడ్డారు.
తాను పార్టీలోనే ఉంటానని, కాంగ్రెస్ను వీడే ప్రసక్తి లేదన్నారు. పిలిచిన వారందరి దగ్గరకు వెళ్తే పొన్నాల ఇబ్బందుల్లో పడతారన్నారు. గ్రేటర్ అధ్యక్షుడికి చెప్పకుండా కార్యక్రమాలు ఎలా పెడతారని ప్రశ్నించారు. తాను కాంటాక్టులో లేనని చెప్పడం సరికాదన్నారు. అది అవాస్తవమన్నారు.
వారానికి ఓసారి కనబడే మర్రి శశిధర్ రెడ్డి కూడా మాట్లాడితే ఎళా అన్నారు. ఇప్పుడు సనత్ నగర్ ఉప ఎన్నికల కోసమే ఆయన కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీలో విభజించి పాలించాలని మర్రి చూస్తున్నారని మండిపడ్డారు. నేను కావాలో వద్దో పొన్నాల తేల్చుకోవాలన్నారు. అదే విషయం పొన్నాలకు చెప్పానన్నారు. మర్రి ఎక్కడ ఉంటే అక్కడ విధ్వంసమే అన్నారు.