మూడు అబద్ధాలు, ఆరు మోసాలు: బాబు ప్రభుత్వంపై విజయసాయి ఫైర్
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విజయసాయి రెడ్డి, పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఏడాది పాలన మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా సాగిందని విమర్శించారు.
చంద్రబాబు ఏడాది పాలనకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విజయసాయి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 5 ప్రధాన అంశాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమరదీక్ష చేయనున్నారని వెల్లడించారు.
రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, బలవంతపు భూసేకరణకు నిరసనగా జగన్ దీక్ష చేస్తారని చెప్పారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిందేమి లేదన్నారు.
జగన్ దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందేమో చూడాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, మేకా శేషుబాబు అన్నారు. విభజన వల్లే హామీలు నెరవేర్చలేకపోతున్నామని చంద్రబాబు చెప్పడం పచ్చి మోసమని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే విధానంగా చంద్రబాబు పాలన చేస్తున్నారని ఆరోపించారు.