'పార్టీ మారే ఆలోచన లేదు, వ్యక్తిగత కారణాల వల్లే హాజరు కాలేదు'
హైదరాబాద్: పార్టీ మారే ఆలోచన తనకు లేదని విజయనగరం జిల్లాకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆ జిల్లా నేతలు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో సమావేశమయ్యారు.
వైయస్ జగన్ను కలిసిన తర్వాత సుజయ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిపారు. తాను తెలుగు దేశం పార్టీ నేతలతో ఎప్పుడూ సంప్రదింపులు జరపలేదని పేర్కొన్నారు.
తాను పార్టీ మారబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తమని చెప్పారు. మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వ్యక్తిగత కారణాల వల్లే హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చారు.
ఇక జిల్లాలోని బోగాపురం ఎయిర్ పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో సెక్షన్ 30 అమలుపై వైయస్ జగన్తో జరిగిన సమావేశంలో చర్చించినట్టు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి చెప్పారు.