అమెరికాలో బెజవాడ అమ్మాయి మృతి: రోడ్డు దాటుతూ అనంత లోకాలకు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన అమ్మాయి మరణించింది. రోడ్డు దాటుతుండగా ప్రమాదం సంభవించి ఆమె మరణించినట్లు తెలుస్తోంది.
విజయవాడ: అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన అమ్మాయి అసువులు బాసింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెమోంట్స్ నీలెస్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో చందూరి సాయి తేజస్వి అనే 23 ఏళ్ల యువతి మృత్యువు పాలైంది.
బుధవారం రాత్రి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన చండూరి విష్ణువర్ధన్, కోటీశ్వరి దంపతుల పెద్ద కూతురు తేజస్వి. రోడ్డు దాటుతుండగా తేజస్విని మృత్యువు కబళించినట్లు చెబుతున్నారు.
క్రాస్ వాక్ లేని చోట సాయి తేజస్వి రోడ్డు దాటుతుండగా రెండు వాహనాలు వచ్చాయని, సాయి తేజస్విని చూసి మొదటి వాహనం ఆగగా, రెండో వాహనం ఆమెను ఢీకొట్టిందని చెబుతున్నారు. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలప్రోలులో గల సరోజినీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈసిఈ చదివిన తేజస్విని ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి సాయంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేజస్విని మృతదేహాన్ని విజయవాడకు తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.