పేద మహిళను వరించిన డిజిధన్ లక్కీ డ్రా: రూ.66.75కు లక్ష బహుమతి
టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెజవాడకు చెందిన పేద మహిళను ఆ అదృష్టం వరించింది. డిజిధన్ లక్కీడ్రాలో ఆమెకు రూ. లక్ష బహుమతిగా లభించింది.
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి బహమతులు(డిజిధన్) అందించేందుకు మెగా డ్రాలుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు.
ఈ నేపథ్యంలో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బెజవాడకు చెందిన పేద మహిళను ఆ అదృష్టం వరించింది. నగదు రహిత లావాదేవీలలో కేంద్రం ఈ నెలలో నిర్వహించిన వీక్లీ మెగా బంపర్ డ్రాలో లక్ష రూపాయల నగదు బహుమతిగా లభించింది.
విజయవాడలోని చుట్టుగుంటకు చెందిన బొడ్డని రమణమ్మ జనవరి 6న రేషన్ డిపోలో నిత్యావసరాలను తీసుకుంది. నిత్యావసరాల వ్యయాన్ని రూ.66.75కు ఆధార్ ఆధారిత విధానంలో చెల్లించింది. కేంద్ర ప్రభుత్వ వీక్లీ మెగా డ్రాలో రమణమ్మ లక్ష రూపాయల బహుమతికి ఎంపికైంది. వెంటనే ఈ విషయాన్ని కృష్ణా జిల్లా యంత్రాంగానికి కేంద్రం తెలియజేసింది.
ఆ వెంటనే రమణమ్మ పేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబర్ను ఆధార్తో గుర్తించి తక్షణం రూ.లక్షను ఆమె ఖాతాలో జమ చేశారు. ఈ సమాచారాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు కలెక్టర్ బాబు తెలిపారు. శాఖ అధికారి ఎ.ఉదయభాస్కర్ ఆమె వివరాలను సేకరించారు.
తన సర్కిల్ పరిధిలోనే చుట్టుగుంటలో ఆమె నివసిస్తోందని తెలుసుకుని, వెంటనే ఆమెకు విషయాన్ని చెప్పారు. బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ అయిన విషయాన్ని కూడా చెప్పారు. దీంతో ఒక్కసారిగా రమణమ్మ ఆశ్చర్యంతో భావోద్వేగానికి గురయ్యారు. పేదరికంలో మగ్గుతున్న తనకు లక్షరూపాయలు బహుమతిగా ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు బహుమతి లభించడంపై ఆనందం వ్యక్తం చేసిన ఆమె రూ.లక్షను తన పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్టు చెప్పారు.