మోసపోవద్దు: ‘గే’లమంటూ వల వేస్తారు! రూ. లక్షలు కాజేస్తారు!!
విశాఖపట్నం: సోషల్ మీడియా ద్వారా స్వలింగ సంపర్కులమని చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడిన ఐదుగురు నిందితులను విశాఖపట్నం సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం విశాఖపట్నం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర సంయుక్త పోలీసు కమిషనర్ డి నాగేంద్రకుమార్ ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించారు.
ముఠాగా ఏర్పడిన స్నేహితులు
మర్రిపాలెం ప్రాంతానికి చెందిన ముక్కల ఆదిత్య(20), అమీరుద్దీన్ ఖాన్(26), పెంటా అరుణ్కుమార్(25), ఉంగరాల రవిరాజ్(19), కంచరపాలెం ప్రాంతానికి చెందిన దంత జితేష్(21) స్నేహితులు. వీరంతా వేర్వేరు పనులు చేస్తుంటారు. అయితే, సామాజిక మాధ్యమమైన ఫేస్బుక్ను ఎన్నుకొని నగదు సంపాదించాలన్న ఆలోచనలతో ఫేస్బుక్లో 2,335 మంది సభ్యులతో కూడిన గే(స్వలింగ సంపర్కుల )గ్రూప్లో చేరారు.
చాటింగ్ చేస్తూ వల..
వీరంతా గ్రూప్ సభ్యులకి ఎప్పటికప్పుడు సందేశాలు పంపిస్తుండేవారు. కాగా, గ్రూప్లో సభ్యుడిగా ఉన్న తాడి రాహుల్ (24) వీరితో తరచూ చాటింగ్ చేస్తూ ఉండేవాడు. ముక్కల ఆదిత్య.. ‘అజయ్ గుల్లా' అనే నకిలీ పేరుతో ఉన్న తన ఖాతాతో రాహుల్కి సందేశం పంపించి, జులై 12న ఒంటరిగా కలవడానికి సిద్ధంగా ఉన్నానని నమ్మించాడు. దీంతో నమ్మిన బాధితుడు ఎంవీపీ కాలనీ సెక్టర్-9లో ఉన్న ఓ హాస్టల్ గదికి ఒంటరిగా రావడానికి అంగీకరించడంతో నిందితుడు అక్కడికి చేరుకున్నాడు.
Recommended Video
బెదిరింపులకు గురిచేసి..
కాగా, వారి ఏకాంత సమయానికి ఇద్దరు వచ్చి మీడియాలో పనిచేస్తున్నామని, వీడియోలు తీశామని నమ్మించారు. మరో ఇద్దరు వచ్చి టాస్క్ఫోర్స్ పోలీసులమంటూ బెదిరింపులకు గురిచేశారు. ముందుగా తీసిన వీడియో చూపించి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన రాహుల్ తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.50 లక్షల సొమ్ములో డిమాండ్ చేసినంత డ్రా చేసి ఇవ్వడానికి అంగీకరించాడు. దీంతో బాధితుడు పని చేస్తున్న సంస్థ గుర్తింపు కార్డు, సెల్ఫోన్ తీసుకొని సమీపంలో ఉన్న ఏటీఎం సెంటర్కి పంపించారు.
రూ.2లక్షలతో ఉడాయించారు..
అదేరోజు రూ.1 లక్ష డ్రా చేసిన నిందితులు, మరుసటి రోజు మరో రూ. 1 లక్ష తీసుకొని పరారయ్యారు. దీంతో బాధితుడు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసును సైబర్క్రైం పోలీసు స్టేషన్కి బదిలీ చేయడంతో విచారించిన సైబర్ క్రైం పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,36,500 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కేసుల్లో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేయాలని డి నాగేంద్రకుమార్ కోరారు. ఈ మీడియా సమావేశంలో డీసీపీ రవికుమార్ మూర్తి, సీఐ గోపీనాధ్, ఎస్సై రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు.