భగీరథడువుతారు: చంద్రబాబును ప్రశంసించిన బిజెపి ఎమ్మెల్యే విష్ణు
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా బిజెపి శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు మంగళవారంనాడు శానససభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాశానికెత్తారు. పట్టిసీమ ప్రాజెక్టును ఇంత త్వరతింగా చంద్రబాబు పూర్తి చేస్తారని అనుకోలేదని, అంత వేగంగా పూర్తి చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా అంతే వేగంతో పూర్తి చేయాలని, అప్పుడు చంద్రబాబునాయుడని భగీరథడంటారని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాను కాంగ్రెసు ప్రభుత్వం చట్టంలో ఎందుకు పెట్టలేదని ఆయన అడిగారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏది లాభసాటిగా ఉంటే అది కేంద్రం ఎపికి ఇస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాపై ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఎపికి కేంద్రం ఎంతో సాయం చేసిందని ఆయన చెప్పారు. విభజన చట్టంలో లేనివాటిని కూడా కేంద్రం ఇచ్చిందని ఆయన చెప్పారు. 24 గంటలు విద్యుత్తు సరఫరాకు కేంద్రం సాయం చేసిందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
కుట్ర చేసి బురద చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఎపిలో విలీనం చేస్తూ చంద్రబాబు మోడీతో మాట్లాడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని, ఆ ఆర్డినెన్స్ జారీ చేయకపోతే పోలవరం ముందుకు కదిలేది కాదని ఆయన అన్నారు. ఎపి రాజధాని కోసం కేంద్రం 1500 కోట్ల రూపాయలు ఇచ్చిందని, విద్యాసంస్థల స్థాపనకు 3700 కోట్లు ఇచ్చిందని ఆయన చెప్పారు.