ఏడాది సస్పెండైనా.. : రోజాపై విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం
అసెంబ్లీలో అగ్రిగోల్డ్ కేసు విషయంలో మాట్లాడుతున్న సమయంలో రన్నింగ్ కామెంట్రీ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు.
అమరావతి: అసెంబ్లీలో అగ్రిగోల్డ్ కేసు విషయంలో మాట్లాడుతున్న సమయంలో రన్నింగ్ కామెంట్రీ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు. అప్పటికే వైసీపీ సభ్యుల ఆందోళనతో పలుమార్లు వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభమైంది.
ఆ తర్వాత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ భూములను మంత్రి పుల్లారావు కొనుగోలు చేశారని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారని, అంతేగాక, జూడీషియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించాలని పట్టుబట్టారని చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని అన్నారు.
అయితే, జగన్ మాత్రం విచారణకు ఎందుకు అంగీకరించడం లేదో తెలియడం లేదని అన్నారు. తాను జగన్ స్థానంలో ఉండిఉంటే విచారణకు అంగీకరించేవాడినని అన్నారు. జగన్ కు.. ఇతరులపై బురద జల్లడం పరిపాటి అయ్యిందని అన్నారు. ప్రతిపక్ష నేత కాబట్టి చెంపలు వాయించుకోవాల్సిన అవసరం లేదని.. సవాలును ఉపసంహరించుకుంటే సరిపోతుందని అన్నారు.
కాగా, విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనక వరుసలో కూర్చున్న ఎమ్మెల్యే రోజా రన్నింగ్ కామెంట్రీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది సస్పెండైనా కూడా రోజాకు పరివర్తన రాలేదని అన్నారు. మళ్లీ ఇలాంటి రన్నింగ్ కామెంట్లేంటని ప్రశ్నించారు. రోజా తనకు కేటాయించిన సీటులో కూర్చుంటే బాగుంటుందని విష్ణుకుమార్ రాజు చురకంటించారు.