జగన్కు 'వరంగల్' షాక్, నువ్వెందుకు: కేసీఆర్కు సీతక్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర రావు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం నాడు తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్కు గుత్తా లేఖ
నల్గొండ జిల్లా పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు శుక్రవారం లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తికి సాగర్ లో నీటి విడుదల తగ్గించాలని లేఖలో పేర్కొన్నారు.
రబీ అవసరాలకు నీటిని నిల్వ ఉంచాలని సూచించారు. నీటిని విడుదల చేయడం వల్ల పులిచింతల ప్రాజెక్టు నిండిపోయి తెలంగాణలో పలు గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖలో హెచ్చరించారు. శ్రీశైలంలో 834 అడుగుల నీటి మట్టం ఉండేలా చూడాలన్నారు.
కృష్ణా బోర్డు చైర్మన్తో ఏపీ మంత్రి ఉమ భేటీ
కృష్ణా బోర్డు చైర్మన్తో ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, నీటి పారుదల శాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం జల విద్యుత్ సమస్యను మంత్రి ఉమ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లారు. శ్రీశైలంలో జల విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వెళ్తోందని చైర్మన్కు ఫిర్యాదు చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కాల్వ విద్యుత్ ఉత్పత్తి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు తెలుపుతూ కృష్ణా రివర్ బోర్డుకు మరో లేఖ రాసింది. ఎడమ గట్టు కాల్వ విద్యుత్ ఉత్పత్తి ద్వారా తాగునీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పు పడుతూ ఈ లేఖ రాసింది. ఎడమ గట్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంది. ఇదిలా ఉండగా సాయంత్రం కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.
కేసీఆర్ పైన సీతక్క ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ నేత సీతక్క మండిపడ్డారు. తెలంగాణలో కల్లు కాంపౌండ్లు వెల్లి విరిసేలా కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్కు కల్లు కాంపౌండ్ల మీద ఉన్న శ్రద్ధ రైతులకు విద్యుత్ అందించాలనే దానిపై లేదన్నారు. తెలంగాణ ప్రజలకు విద్యుత్ లేకున్నా మద్యం మాత్రం ఫుల్గా దొరుకుతోందని ఎద్దేవా చేశారు. ఒకవైపు చంద్రబాబును, మరోవైపు మోడీని నిలదీయమన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఆ మాత్రం దానికి ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకన్నారు.
కాగా, తెలంగాణలోని టీడీపీ కార్యాలయాలపై దాడుల వెనుక తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హస్తం ఉందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జూపల్లితో పాటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా దీనికి బాధ్యుడే అని అన్నారు. జగదీశ్వర్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆందోళనలు చేయాలని జూపల్లి తెరాస కార్యకర్తలకు ఎస్సెమ్మెస్లు పంపించారని ఆరోపించారు. జూపల్లిపై చర్యలు తీసుకోకపోతే తాము కోర్టుకు వెళతామన్నారు. కేసీఆర్ ఒక అసమర్థుడని, ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, మోడీలపై తెరాస ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.