ట్విస్ట్: బిజెపి దూకుడు అందుకేనా, 2019లో కమలంతో పొత్తుకు వైసీపీ రె'ఢీ'?
2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయపరిస్థితులు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. వైసీపీ బిజెపిల మధ్య దూరం తగ్గుతోందనే సంకేతాలు కన్పిస్తున్నాయి.
అమరావతి: 2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయపరిస్థితులు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. వైసీపీ బిజెపిల మధ్య దూరం తగ్గుతోందనే సంకేతాలు కన్పిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కమలనాథులతో పొత్తును వైసీపీ నేతలు మాత్రం తోసిపుచ్చడం లేదు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొంటామని నర్మగర్భంగా చెబుతున్నారు. అయితే బిజెపి నేతలు ఇటీవలకాలంలో టిడిపిపై ఒకింత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ వ్యవహరశైలిని బిజెపి ,నేతలు కొందరు ఒంటికాలిపై లేస్తున్నారు. టిడిపితో పొత్తును తెంచుకొంటే, బిజెపితో పొత్తు విషయాన్ని 2019 ఎన్నికల్లో ఆలోచిస్తామని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స ప్రకటించడం రాజకీయ సమీకరణాల్లో మార్పులకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.
2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపి, టిడిపిలు కలిసి పోటీచేశాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో టిడిపితో కలిసిపోటీచేయాలనే ఉద్దేశ్యం ఆ ప్రాంతానికి చెందిన బిజెపి నేతల్లో లేదు.అయితే పార్టీ జాతీయనాయకత్వం ఆదేశాల మేరకు టిడిపితో పొత్తును బిజెపి నేతలు అంగీకరించాల్సిన అనివార్యపరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ఏపీలో మాత్రం ఈ పొత్తును బిజెపి నాయకత్వం వ్యతిరేకించలేదు.అయితే కేంద్రంలో టిడిపి చేరింది. ఏపీ రాష్ట్రంలో కూడ బిజెపికి రెండు మంత్రి పదవులను టిడిపి కేటాయించింది.
Recommended Video
అయితే మరో రెండు ఏళ్ళలో ఎన్నికలు రానున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకొన్నాయి. వైసీపీ నుండి విజయం సాధించిన 21 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఇలా పార్టీమారినవారికి మంత్రివర్గంలో చంద్రబాబునాయుడు స్థానం కల్పించారు.అయితే తెలంగాణలో కూడ టిఆర్ఎస్ ఏ రకంగా వ్యవహరించిందో అదే పంథాను వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులను కట్టబెట్టడంలో ఏపీలో అవలంభించింది.అయితే తెలంగాణలో మాత్రం ఈ విషయంలో టిడిపి అధికారపక్షంపై విమర్శలుచేసింది. కోర్టుకు వెళ్ళింది. ఏపీలో వైసీపీ నేతలు ఈ విషయాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు.
ఏపీలో టిడిపితో పొత్తును వద్దని బిజెపి నేతలు కోరుతున్నారు. స్వతహగా బలాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలను చేస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇటీవల ఏపీలో బూత్స్థాయి పదాదికారుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో టిడిపితో పొత్తు వద్దని నేతలు కోరారు. పార్టీకి చెందిన సీనియర్లతో అమిత్షా విడిగా సమావేశమైన సమయంలో కూడ ఇదే రకమైన అభిప్రాయాన్ని బిజెపి నేతలు వ్యక్తం చేశారు. అయితే 2019 వరకు రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. మరోవైపు పొత్తు గురించి, రెండు పార్టీల మధ్య పరస్పర విమర్శలు వద్దని కూడ బిజెపి చీఫ్ అమిత్షా పార్టీ శ్రేణులకు సూచించారు. పొత్తు విషయాన్ని పార్టీ నాయకత్వం చూసుకొంటుందని ఆయన ప్రకటించారు. అయితే విజయవాడలో జరిగిన సభలో టిడిపితో పొత్తు వద్దని బహిరంగంగా ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై బిజెపి చర్యలను తీసుకొంది.
బిజెపికి సన్నిహితంగా వైసీపీ
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థి రామ్నాద్కోవింద్కు వైసీపీ తన మద్దతును ప్రకటించింది. కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రకటించిన మీరాకుమార్కు వైసీపీ మద్దతు ప్రకటిస్తోందని తొలుత భావించారు.కానీ, వైసీపీ ఎన్డిఏ అభ్యర్థికి మద్దతుగా నిలవడంతో విపక్షాలు వైసీపీపై విరుచుకుపడ్డాయి.ప్రధానమంత్రి మోడీని కలిసిన వెంటనే రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎన్డిఏ అభ్యర్థికి మద్దతును ప్రకటించడం వెనుక ఇతరత్రా కారణాలు ఉన్నాయని టిడిపి నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. తనపై ఉన్న కేసులను పరిష్కరించుకొనేందుకే రామ్నాద్కు వైసీపీ మద్దతు ప్రకటించిందని కూడ టిడిపి విమర్శలు చేసింది. అయితే వైసీపీ బిజెపికి దగ్గరకావడం రాజకీయంగా టిడిపికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతోంది.అయితే ఈ రెండుపార్టీల మద్య ఉన్న పొత్తు తెగతెంపులు అవుతోందని ఇప్పటికిప్పుడు చెప్పలేం. వెంటనే వైసీపీతో బిజెపి పొత్తు పెట్టుకొంటోందని కూడ చెప్పలేం.కానీ, వైసీపీ బిజెపికి సన్నిహితంగా ఉండేందుకు సిద్దమనే సంకేతాలు ఇవ్వడం 2019 ఎన్నికల్లో రాజకీయసమీకరణాల్లో మార్పులకు నాంది పలికే అవకాశం లేకపోలేదు.
వైసీపీకి లాభమా , నష్టమా
2014 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఒంటరిగానే పోటీచేసింది. 2019 ఎన్నికల్లో బిజెపితో వైసీపీ కలిసి పోటీచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చకూడ ఆ పార్టీవర్గాల్లో లేకపోలేదు.అయితే వైసీపీకి మైనార్టీవర్గాలు అండగా ఉంటున్నారు.వైసీపీ బిజెపితో పొత్తు పెట్టుకొంటే మైనార్టీ ఓట్లు వైసీపీ నష్టపోయే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కాంగ్రెస్పార్టీ నుండి బయటకు వచ్చి కడప పార్లమెంట్ఎన్నికల సమయంలో బిజెపితో పొత్తు ఉంటుందని మీడియాలో చేసిన ప్రచారంపై జగన్ ప్రొద్దుటూరులో జరిగిన సభలో వివరణ ఇచ్చారు. బిజెపితో పొత్తుపెట్టుకొనే పరిస్థితిలేదని ఆయన ఆ సభలో ప్రకటించారు. తనపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రకటించారు. మైనార్టీలకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. అయితే వైసీపీకి మైనార్టీలు అండగా ఉంటున్నారు. అయితే బిజెపితో పొత్తు పెట్టుకొంటే వైసీపీకి మైనార్టీలు దూరంగా జరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఏ పార్టీకి ప్రయోజనం కల్గిస్తోందనేది ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.అయితే వైఎస్ రాజశేఖర్రెడ్డి బతికున్నకాలంలో బిజెపికి దూరంగా ఉన్నారని, కానీ, బిజెపికి దగ్గరయ్యేందుకు సంకేతాలు పంపిన జగన్ వైఎస్ ఆశయాలను తుంగలోతొక్కారనే ఆరోపణలు కూడ లేకపోలేదు.
టిడిపి తీరును ఎండగడుతున్న బిజెపి
ఏపీ రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న టిడిపి అనుసరిస్తున్న విధానాలను బిజెపి నేతలు తీవ్రంగానే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుసరిస్తున్న మద్యం పాలసీపై మహిళలు ఆందోళన సాగిస్తున్నారు.ఈ విషయమై బిజెపికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వతీరును ఎండగట్టారు. రాష్ర్టంలో ప్రతి ఇంటికి బిర్యానీ, మద్యాన్ని సరఫరాచేస్తున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. విశాఖలో చోటుచేసుకొన్న భూ కుంభకోణంపై కూడ బిజెపి శాసనసభపక్షనాయకుడు విష్ణుకుమార్రాజు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టిడిపితో తెగతెంపులు చేసుకోవాలని భావిస్తున్న బిజెపి నేతలు ఇదే అదనుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
2019 రాజకీయ సమీకరణాలు మారేనా
2019 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి మద్దతును ప్రకటించిన జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ ఈ ఎన్నికల్లో స్వంతంగా పోటీచేసే అవకాశం కన్పిస్తోంది.అయితే వామపక్షాలతో పవన్ జతకట్టనున్నారు. మరోవైపు వైసీపీ ఈ కూటమిలో ఉండకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి. ఎన్డిఏకు వైసీపీ చీఫ్ మద్దతిచ్చినందున ఈ కూటమిలో వైసీపీకి స్థానం లేదని ఏపీ సీపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ ఇదివరకే ,ప్రకటించారు.మరోవైపు టిడిపి బిజెపిల మధ్య పొత్తు కొనసాగుతోందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విచ్చిన్నమైతే వైసీపీతో బిజెపి కలిసి పోటీచేస్తోందా , ఒంటరిగా పోటీచేస్తోందా అనేది ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టం. అయితే ఎన్నికల సమయం నాటికి నెలకొనే రాజకీయపరిస్థితులకు అనుగుణంగా రాజకీయశక్తుల పునరేకీకరణ జరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.అయితే టిడిపితో బిజెపి పొత్తును తెగతెంపులు చేసుకొంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొనే విషయమై ఆలోచిస్తామని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రకటించడం కూడ బిజెపితో పొత్తు సానుకూలమనే సంకేతాలను ఇచ్చినట్టైంది.