అదే జరిగితే శిల్పాకు దెబ్బే, పోటీకి సై అంటోన్న అఖిలప్రియ
నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ అనివార్యమైతే ఎదుర్కోనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ అనివార్యమైతే ఎదుర్కోనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించారు.
నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడే అవకాశం ఉన్నందున టిడిపి నాయకత్వం ఈ విషయమై జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టిడిపి నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలను చేస్తోంది. ఈ మేరకు మిగిలిన విపక్షాలతో కూడ మాట్లాడేందుకు అధికారపార్టీ మాట్లాడే ప్రయత్నాలు చేస్తోంది.
చివరినిమిషం వరకు ఈ స్థానం ఏకగ్రీవమయ్యేందుకే టిడిపి ప్రయత్నాలను చేస్తోంది. అనివార్యమైతే పోటీకి కూడ సిద్దమనే సంకేతాలను టిడిపి నాయకత్వం ఇచ్చింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకొంటుంది.నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల విషయమై మంత్రి అఖిలప్రియ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.
అనివార్యమైతే పోటీకి సై
నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టిడిపి నాయకత్వం ప్రయత్నాలను చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్న సంప్రదాయాలను 2014 ఎన్నికల ముందు ఆళ్ళగడ్డ ఉప ఎన్నికల సందర్భంగా టిడిపి నాయకత్వం అవలంభించిన పద్దతిని ఆ పార్టీ గుర్తుచేస్తోంది. ఆయా నియోజకవర్గాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కుటుంబాల నుండి పోటీచేసే సమయాల్లో తాము పోటీకి అభ్యర్థులను నిలపని విషయాలను టిడిపి ప్రస్తావిస్తోంది.పోటీ తప్పకపోతే ఎదుర్కొనేందుకు కూడ సిద్దంగా ఉన్నామని మంత్రి అఖిలప్రియ చెప్పడం కూడ ఈ వ్యూహంలోనే భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భూమా బ్రహ్మనందరెడ్డితో విజయం
నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మనందరెడ్డిదే విజయం తథ్యమని మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. నంద్యాలలో తమ ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్దిని ప్రజలు ఎవరూ కూడ మర్చిపోలేరని చెప్పారు. నంద్యాలను అభివృద్ది చేసేందుకు భూమా నాగిరెడ్డి అహర్నిశలు కృషిచేశారని అఖిలప్రియ ప్రకటించారు. ప్రతి వార్డులో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొన్నారన్నారు.
ఏకగ్రీవమైతే శిల్పాకు నష్టమే
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు ఏకగ్రీవమైతే టిడిపి నుండి వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్టు ఖరారు చేసే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చివరి నిమిషం వరకు తాత్సారం చేయడంతో ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో టిక్కెట్టు కోసం తాను చేరలేదని ఆయన ప్రకటించారు. టిడిపిలో ఉన్నంతకాలం ఈ ఉప ఎన్నికల్లో తాను పోటీచేస్తానని శిల్పా పట్టుబట్టారు. ఒకవేళ ఈ స్థానం ఏకగ్రీవంగా మారితే శిల్పా రెంటికి చెడ్డరేవడిగా మారే పరిస్థితులు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రూ.500 కోట్లతో అభివృద్ది పనులు
2014 ఎన్నికల సమయంలో నంద్యాలలో తనను గెలిపిస్తే ఇళ్ళ నిర్మాణంతో పాటు, రోడ్ల విస్తరణ ఇతర అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నట్టు భూమా నాగిరెడ్డి ప్రకటించారు.అయితే ఆయన ఈ ఏడాది మార్చిలో మరణించడంతో అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. అంతేకాదు ఎన్నికలముందు తండ్రి ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 21న, నంద్యాలలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గృహనిర్మాణ స్కీమ్ ను ప్రారంభించారు.