మజ్లిస్తో ఎన్నటికీ కలవం: డిగ్గీపై కిషన్ రెడ్డి ఘాటుగా..
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీతో మజ్లిస్ దోస్తీ చేస్తోందన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యల పైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మజ్లిస్ పార్టీతో తాము ఎప్పటికీ సంబంధం పెట్టుకునేది లేదన్నారు. తమ పార్టీ పైన దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రౌడీలు, గూండాలతో మజ్లిస్ పార్టీకి సంబంధం ఉందన్నారు. మజ్లిస్ ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకర మజ్లిస్ పార్టీతో తమ పార్టీ ఎన్నడూ సంబంధాలు పెట్టుకోదని స్పష్టం చేశారు. వాస్తవానికి మజ్లిస్కి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయని, కాంగ్రెస్ హయాంలో మజ్లిస్ ఏది కోరితే దాన్ని ఆ పార్టీ క్షణాల్లో సమకూర్చేదన్నారు.
ఉదయం పది గంటలకు తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభాపతి మధుసూదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్షాల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. విత్తనాలు, కల్యాణ లక్ష్మీ, బంగారు తల్లి తదితర వాటి పైన విపక్షాలు ప్రశ్నించారు. వీటికి మంత్రులు హరీష్ రావు, కేటీ రామారావు, ఈటెల రాజేందర్ తదితరులు సమాధానం ఇచ్చారు.
కల్యాణ లక్ష్మీ పథకాలను అక్టోబర్ 2వ తేదీ నుండి అమలు చేస్తామని ఈటెల చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతులకు పెళ్లి రోజునే రూ.51 వేలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. పెళ్లికి నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు.
కల్యాణ లక్ష్మీ పథకం దళితులకు ఆసరాగా నిలుస్తుందని రసమయి బాలకిషన్ అన్నారు. పెళ్లి పత్రికతో ఇంటికి వచ్చిన దళితులను సీఎం కేసీఆర్ ఏనాడు కూడా వట్టి చేతులతో పంపించలేదన్నారు. దళితుల సమస్యలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అన్నారు.
దళిత కుటుంబాల్లో పెళ్లి అంటే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునన్నారు. తన ఇంట్లో చెల్లి పెళ్లి చేసిన తన తండ్రి బొంబాయి వెళ్లిపోయాడని, బాల్యమంతా తండ్రి లేకుండానే గడిచిందన్నారు. కళ్యాణ లక్ష్మి ప్రవేశ పెట్టిన కేసీఆర్కు ఎమ్మెల్యే శోభ ధన్యవాదాలు తెలిపారు.