డబ్బులు పంచినట్టు నిరూపిస్తే పోటీ నుండి నాన్నను ఉపసంహరింపచేస్తా: శిల్పా రవిచంద్ర
నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు తాము డబ్బులు పంచుతున్నామని టిడిపి నిరూపిస్తే మా నాన్నను వెంటనే ఉపఎన్నికల బరినుండి ఉపసంహరింప చేస్తానని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర .
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు తాము డబ్బులు పంచుతున్నామని టిడిపి నిరూపిస్తే మా నాన్నను వెంటనే ఉపఎన్నికల బరినుండి ఉపసంహరింప చేస్తానని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర ప్రకటించారు.
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి కుటుంబసభ్యులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, డబ్బులు పంచుతున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వీడియోలను, ఫోటోలను ఆయన మీడియాకు విడుదల చేశారు.
ఈ విషయమై పెద్ద ఎత్దున దుమారం చెలరేగింది. దీంతో వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.అయితే ఈ విషయమై టిడిపి చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర ప్రకటించారు.
ఈ విషయమై ఆయన నంద్యాలలో ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు. శిల్పా మోహన్రెడ్డి ఫోటో, ఎన్నికల గుర్తుతో పాటు బొట్టు బిల్లల ప్యాకెట్ను ఓటర్లకు పంచినట్టు ఆయన చెప్పారు. ఎవరికీ డబ్బులు పంచలేదన్నారు.
డబ్బులు పంచినట్టు టిడిపి నేతలు నిరూపిస్తే మా నాన్నను వెంటనే ఎన్నికల బరి నుండి ఉపసంహరింపచేస్తానని రవిచంద్ర చెప్పారు. టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. డబ్బులు పంచాల్సిన అవసరం లేదన్నారు.
శిల్పా సేవా సమితి నుండి కూడ ఎన్నికల కోసం కార్యక్రమాలను నిర్వహించడం లేదన్నారు. సెప్టెంబర్ తర్వాతే సేవా సమితి కార్యక్రమాలు సాగుతాయని ఆయన చెప్పారు.