జగన్ నీ వెనుక సిబిఐ కేసులు, సరుకు లేదు, పరుగు పెట్టిస్తాం: దేవినేని
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం మండిపడ్డారు. జగన్ వద్ద విషయం లేదని, తాము ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు.
పట్టిసీమలాగే పోలవరం ప్రాజెక్టును పరుగు పెట్టిస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని, తాము దానిని పరుగు పెట్టిస్తున్నామన్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా రూ.ఎనిమిది వందలకు పైగా ఖర్చు పెట్టామన్నారు. పదిహేను నెలల్లో గుండ్లకమ్మ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు.
ప్రాజెక్టులను మేం పరుగులు పెట్టిస్తుంటే.. రాజకీయంగా పుట్టగతులు ఉండవనే వైయస్ జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు. పచ్చకామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నారు. జగన్ తీరు అలాగే ఉందన్నారు.
ఏమైనా అంటే అనవసరంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతోంది జగన్ అన్నారు. జైలుకు వెళ్లినందుకు గర్వపడేందుకు జగన్ స్వతంత్ర సమరయోధుడు కాదన్నారు. తాము చేపట్టే ప్రాజెక్టులు పూర్తయితే జగన్కు రాజకీయ సమాధే అన్నారు.
జగన్ తన వెనుక ఉన్న సిబిఐ కేసులు గుర్తు చేసుకొని మాట్లాడాలన్నారు. జగన్ వద్ద సరుకు (విషయం) ఉంటే కరవు గురించి సలహాలు, సూచనలు ఇచ్చే వారన్నారు. ఆయన వద్ద సరకు లేక పట్టుమని అరగంట మాట్లాడకుండానే.. సభలో పోలవరం, పట్టిసీమ అన్నారన్నారు.