ప్రత్యేక హోదాపై మంత్రి సుజనా, వెంకయ్యకు అన్నీ తెలుసు: పత్తిపాటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించేందుకు చివరివరకూ ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి రాష్ట్రానికి నిధులు రాబడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2015-16 బడ్జెట్ బాగుందని అన్నారు. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టిసారిస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పారు.
ఏపీకి అన్యాయం జరిగింది: పత్తిపాటి పుల్లారావు
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి తెలుసున్నారు. ఏపీకి కొన్ని ప్రత్యేక కేటాయింపులు ఇస్తేసే అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ల్యాండ్ పూలింగ్ విజయవంతం: మంత్రి నారాయణ
రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ విజయవంతమైందని మంత్రి నారాయణ చెప్పారు. 33,251 ఎకరాలకు గాను తాము 33,100 ఎకరాలు సేకరించామన్నారు. మే నెలలో రాజధానికి శంకుస్థాపన ఉంటుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ బాగా నిరాశపరిచిందని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో ఈ విషయం చర్చిస్తారని చెప్పారు.