హోదా ట్విస్ట్: బీహార్కు ఏపీతో సంబంధం లేదు, తెలంగాణకూ: నిర్మల
న్యూఢిల్లీ: విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అన్నింటిని తప్పకుండా నెరవేరుస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు స్పష్టం చేశారు.
పార్లమెంటులో కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ చేసిన ప్రకటన బీహార్కు మాత్రమే సంబంధించినదని ఆమె వివరణ ఇచ్చారు. పద్నాలుగవ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులనే ఇంద్రజిత్ సింగ్ చెప్పారని ఆమె తెలిపారు.
బీహార్ను ఆంధ్రప్రదేశ్తో కలిపి చూడలేమని వివరణ ఇచ్చారు. పార్లమెంట్ జరిగితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు. అందుకే సభ జరగనివ్వడం లేదన్నారు.
ఏపీకి, ప్రత్యేక హోదా విషయంలో రెండు రోజుల క్రితం ఇంద్రజిత్ సింగ్ చేసిన ప్రకటన ఏపీలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన మాటల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా రాదనే అర్థమవుతోందని చెప్పారు. దీనిపై నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు.