మోడీని కలిసేందుకే ధైర్యం లేదు, జగన్ సొంత ఊరికీ నీరిస్తాం: బాబు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీని కలిసే ధైర్యం లేదని, ప్రాజెక్టుల ద్వారా తాము జగన్ స్వగ్రామానికి కూడా నీరు ఇచ్చి చూపిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.
శాసన సభ వాయిదా అనంతరం ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకోవడం, వ్యతిరేకించడమే జగన్ పనిగా పెట్టుకున్నార్నారు. మోడీని కలిసే ధైర్యం చేయలేని జగన్ ప్రత్యేక హోదా పైన ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు.
సాగునీటి ప్రాజెక్టుల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది అర్థంలేని వాదన అన్నారు. జగన్ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే పట్టిసీమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రాజెక్టులను వ్యతిరేకించడం విడ్డూరమన్నారు.
జగన్ చేస్తున్న దీక్షల్లో నిబద్ధత లేదన్నారు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారమే సాధించుకోవాలన్నారు. ఈ విషయంలో జగన్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. విభజన పైన పార్లమెంటులో మాట్లాడకపోవడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా పైన రోడ్డు మ్యాప్ తయారవుతోందని చెప్పారు. ఈ సమయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. జగన్ స్వగ్రామానికి కూడా నీరు ఇచ్చి తీరుతామన్నారు.
మంచి అంశాల పట్ల రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. జగన్ గ్రామానికి నీరు ఇస్తామని, అప్పుడేం మాట్లాడుతారో చూద్దామన్నారు. పట్టిసీమను తాము పూర్తి చేస్తున్నామని, రాయలసీమ ప్రాజెక్టులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.