ఏపీకి అద్భుత రాజధాని: గౌడ్, హోదాపై తమిళ సీఎం ప్రశ్నిస్తున్నారని సీతారామన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అద్భుతంగా నిర్మించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ శనివారం అన్నారు. స్వామి గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రి పై కొలవున్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏపీ రాజధానిని అద్భుతంగా నిర్మించాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో అన్ని జిల్లాల్లోను ఎన్జీవోలు... విజయవాడలోని గాంధీనగర్లో గల వెస్ట్ కృష్ణా ఎన్జీవో హోమ్లలా నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటిని ఏపీకి అందిస్తామన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా కూడా దక్కుతుందన్నారు. అయితే, ప్రత్యేక హోదా కోసం దేశంలోని పలు రాష్ట్రాలు కోరుతున్నాయని అన్నారు.
ఏపీకి ప్రత్యేక ఇస్తామంటే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల నుంచి టీడీపీపై ఒత్తిడి ఉందని, అందువల్ల ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టడం లేదన్నారు. అమరావతిలో ఎన్ఐడీ శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్ రాకున్నా అధిక మొత్తంలో నిధులు కేటాయించామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.2,203 కోట్లు, అసెంబ్లీ, రాజ్భవన్ నిర్మాణానికి రూ.500 కోట్లు, రోడ్లు, మౌలిక వసతుల కోసం రూ.1,803 కోట్లు కేటాయించామన్నారు.