శిల్పకు షాక్.. నంద్యాలను వదలం, టీవీ ఛానల్ పెడతా: మౌనిక, తెరపైకి ఆ పేరు
తన తండ్రి భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానం కాబట్టి తాము వదులుకునేది లేదని భూమా అఖిల ప్రియ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తోంది. నంద్యాల సీటు కోసం శిల్పా మోహన్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకుండే పార్టీని వీడి వెళ్లేందుకు కూడా సిద్ధమని ఆయన అంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.
భూమా ఎఫెక్ట్, అక్కడే చంద్రబాబుకు చిక్కు: శిల్పా... జగన్ పార్టీలో చేరుతారా?
అదే సమయంలో, తన తండ్రి భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానం కాబట్టి తాము వదులుకునేది లేదని భూమా అఖిల ప్రియ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె, అఖిల ప్రియ సోదరి అయిన మౌనికా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
నంద్యాలను వదిలేది లేదు
నంద్యాల సీటును ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఫ్యామిలీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మౌనికా రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గాన్ని తన తండ్రి ఎంతో అభివృద్ధి చేశారని, భూమా నాగిరెడ్డి అంటే ఒక నమ్మకమని వ్యాఖ్యానించారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో ఓ స్థాయికి నాన్న తీసుకు వెళ్లారన్నారు.
తెరపైకి బ్రహ్మానంద రెడ్డి పేరు
నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికలో తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని మౌనికా రెడ్డి తేల్చి చెప్పారు. తమ పెదనాన్న కొడుకు బ్రహ్మానంద రెడ్డి పోటీ చేసినా అభ్యంతరం లేదని చెప్పారు. తన సొంత సోదరుడు పోటీ చేస్తే ఎంత సంతోషంగా ఫీలవుతానో, బ్రహ్మానంద రెడ్డి పోటీ చేసినా అంతే ఫీలవుతానని మౌనిక చెప్పారు.
అఖిలప్రియకు మంత్రి పదవి రావడంపై..
తన అక్క అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాము కృతఙ్ఞతలు చెప్పుకున్నామని మౌనిక అన్నారు. తమ తండ్రి ఉండి ఉంటే చాలా బాగుండేదన్నారు. ఎందుకంటే, భూమా నాగిరెడ్డి మంత్రి పదవి తీసుకోవడమనేది నంద్యాల, ఆళ్ళగడ్డ ప్రజల చిరకాల కోరిక అన్నారు.
ఛానల్ పెట్టే ఆలోచనలో అఖిల ప్రియ సోదరి మౌనిక
అక్క కూడా అంతే కష్టపడి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నామని మౌనిక అన్నారు. తన అక్క పైన ఆ నమ్మకం ఉందని చెప్పారు. తనది జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ అని, ఛానెల్ పెట్టాలనే ఆలోచన ఉందని, ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి ప్రణాళిక దశలో ఉందని చెప్పారు.