'ఎన్టీఆర్ నుండి బాబు, లోకేష్ వరకు టీడీపీ ఏమిటో చిట్టా విప్పుతాం'
అనంతపురం: ఈ నెల 28వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అవినీతి చిట్టాను తాము బయటపెడతామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపడతామని రఘువీరా చెప్పారు. 28న తిరుపతిలో చంద్రబాబు, చినబాబు చిట్టా బయటపెడతామని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ నుండి నేటి చంద్రబాబు, లోకేష్ వరకు టీడీపీ పరిస్థితిని చెబుతామన్నారు.
టీడీపీ ఆవిర్భావం నుండి నేటి పార్టీ పరిస్థితి వరకు అన్నీ ప్రజలకు చెబుతామన్నారు. టీడీపీ ఎన్టీఆర్తో మొదలైందని, ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ వరకు ఎలా రూపాంతరం చెందిందో డాక్యుమెంట్స్ ప్రజల ముందు పెడతామన్నారు.
జూన్ చివరి వారం లేదా జూలైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగతామన్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 8 వరకు జిల్లా కేంద్రాల్లో నిరసనలు, దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు.
ఎన్నికల హామీలను విస్మరించారని ఈనెల 25న ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు. పెంచిన పెట్రోలు ధరలను తగ్గించాలని, ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామన్నారు.