అసంతృప్తి: బాబుతో మాట్లాడానని వెంకయ్య, ఏపీకి రూ.2లక్షల కోట్లు
హైదరాబాద్: బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం స్పందించారు. రానున్న ఐదేళ్లలో ఏపీకి రూ.2లక్షల కోట్ల నిధులు వస్తాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రైల్వే, సాధారణ బడ్జెట్ పైన ఏపీ ప్రజలు, సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సహా విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల చిన్నపాటి సమస్యలను బడ్జెట్లో పెట్టలేరన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. బడ్జెట్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానన్నారు. సమస్యను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తక్కువ నిధులు కేటాయింపు నిజమేనని, నిధులు పెంచాలని కోరుతానన్నారు. చంద్రబాబు ఆవేదనలో అర్థముందని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పారు.
హైకోర్టు విభజనకు కేంద్రం మద్దతిస్తుందన్నారు. వాస్తవానికి దర్పణం పట్టేలా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. భద్రత, శుభ్రత, స్వచ్ఛతకు రైల్వే బడ్జెట్లో పెద్దపీట వేశామన్నారు. బడ్జెట్ ప్రభావం ఇప్పుడే తెలిసిరాదని, ఒకట్రెండు ఏళ్లలో తెలుస్తుందన్నారు. గతంలో బడ్జెట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇంకా 40 ఏళ్లు పడుతుందని, మళ్లీ కొత్త హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టలేమన్నారు.
భారత్ వృద్ధి రేటు 8 శాతానికి పెరిగే అవకాశముందని ఆర్థిక సర్వే చెబుతోందని, అదేవిధంగా ఇతర సంస్థల సర్వేలు కూడా భారత్ వృద్ధి రేటు చైనాను మించిపోతుందని తెలుపుతున్నాయన్నారు. ప్రస్తుత సమావేశాల్లో ఆరు ఆర్డినెన్స్లపై చర్చ చేపడతామన్నారు. ఆర్ఢినెన్స్లు జారీచేశాక చేసిన కార్యక్రమాలన్నీ చట్టబద్దమేనన్నారు. భూసేకరణలో చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సీఎంల సమావేశంలో నిర్ణయించామన్నారు.
ఈ ఆర్డినెన్స్ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రైతులకిచ్చే పరిహారం తగ్గించడం లేదన్నారు. బోగ్గు కుంభకోణం కారణంగా సుప్రీం కోర్టు రద్దుచేసిన గనులను తిరిగి వేలం వేస్తామని చెప్పారు. వేలంలో పారదర్శకత పాటిస్తామన్నారు. ఆర్థిక లోటును సరిదిద్దుతున్నామని చెప్పారు. దేశం ఆర్థికంగా కోలుకునేలా చేయాలనేది తమ ప్రయత్నమన్నారు.
కాగా, పోలవరంకు ఈ బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కనీసం సగం కూడా కేటాయించలేదు. గత బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. 2009 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణానికి రూ.16010 కోట్లు దీనిని నాటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
ఇప్పుడు పోలవరం వ్యయం సుమారు రూ.20వేల కోట్లు అవుతాయని అంచనా. ఇప్పటి వరకు రూ.5700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడాదికి కనీసం రూ.5వేల కోట్ల చొప్పున మూడేళ్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.