గొడవలు వద్దు కలిసిపోవాలి, పనులు చెరి సగం: మంత్రి ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగులో ఏ అభివృద్ది పనులు చేసినా తనతో పాటు, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి అడిగిన పనుల్లో చెరి సగం వస్తాయన్నారు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి.
జమ్మలమడుగు: జమ్మలమడుగులో ఏ అభివృద్ది పనులు చేసినా తనతో పాటు, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి అడిగిన పనుల్లో చెరి సగం వస్తాయన్నారు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదినారాయణరెడ్డి ఆదివారం నాడు సాయంత్రం జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ది విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తాను కొన్ని సలహలు ఇచ్చానని, ఆయన కూడ తనకు కొన్ని సలహాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం, జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాలకు ధీటుగా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తామన్నారాయన.
జమ్మలమడుగులో ఏ అభివృద్ది కార్యక్రమాలు జరిగినా మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, తాను అడిగిన పనులే అని చెప్పారు. కార్యకర్తలకు చేరిసగం వస్తాయన్నారు.ఎక్కడ గొడవలు లేకుండా కలిసిపోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.ఎక్కడా ఫ్యాక్షన్ చేయకూడదని ఆయన హితవు పలికారు.
రాజశేఖర్ రెడ్డి కుటుంబం తమ వల్లే గెలిచిందన్నారు. తమ కార్యకర్తలు, నాయకుల కృషి వల్లే తాము గెలిచామన్నారు. మైలవరంలో ఏసీసీ ఫ్యాక్టరీ వచ్చేలా తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. జమ్మలమడుగులో ఇక నుండి ఉచితంగా ఇసుకను ఇస్తామన్నారు. ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించకూడదన్నారు.