విశాఖలో పశ్చిమ బెంగాల్ దొంగలు (ఫొటోలు)
విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చి విశాఖపట్నంలో ఇంటి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు యువకులను నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట ుచేశారు. వారి నుంచి రూ.1.48 లక్షల విలువ చేసే నగదును, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
సిసిఎస్ క్రైం ఎడిసిపి ఎన్ వరదరాజులు అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్ సరిహద్దులో గల గోయస్పూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఫైస్కల్ ఇస్లామ్ ఇలియాస్ షఫీక్ షక్, మహ్మద్ మీజాన్, రషీద్ షేక్లు ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో చాలా కాలంగా ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తున్నారు.
వ్యసనాలకు అలవాడటు పడి, డబ్బులు చాలక దొంగతనాలకు పాల్పడ్డారు. గతంలో పలు దొంగతనాల కేసుల్లో అరెస్టయి 2013లో రాయపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. నిరుడు నవంబర్ 18వ తేదీన జైలు నుంచి విడుదలైన తర్వాత మాల్దా పట్టణానికి వెళ్లిపోయారు. ఈ ఏడాది జనవరి 15వ తేదీ నుంచి తిరిగి దొంగతనాలు ప్రారంభించారు. నిందితులు ముగ్గురు పశ్చిమ బెంగాల్ నుంచి విజయవాడకు రైలులో వస్తుండగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో టీసీ వారిని దింపేశారు. ఆ తర్వాత వారు విశాఖలోకి ప్రవేశించారు. దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. ముగ్గురు నిందితుల్లో రషీద్ షేక్ పరారీలో ఉన్నాడు.
వారు చేసిన దొంగతనాలు
ఈ ఏడాది జనవరి 18వ తేదీన సీతమ్మధార, అభయాంజనేయస్వామి గుడి వద్ద పెనుమత్స సుబ్బరాజుకు చెందిన ఎస్ఎల్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 355 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.15 లక్షల నగదును లాకర్ పగులగొట్టి దొంగిలించారు.
ఫిబ్రవరి 16వ తేదీన సీతమ్మధార, ఎపిఎస్ఈబీ కాలనీలో కిటికీ పగులగొట్టి ఆకుల సుబ్బారావుకు చెందిన ఇంటిలో ప్రవేశించి రూ.35 వేల నగదు, అర తులం వెండి వస్తువులు దొంగిలించారు.
మార్చి 23వ తేదీన కంచరపాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని కాకాని నగర్లో తాళం వేసి ఉన్న కంకిపాటి సాహిత్య వర్మ, మనోజ్ శేఖర్ రాత్ల ఇంటి నుంచి వెండి నగలను దొంగిలించారు.