'ఒళ్లంతా విషం, అక్కడే స్నానం చేసిన జగన్.. చంద్రబాబుకేం చెప్తారు'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టిసీమను వ్యతిరేకించిన జగన్, నదుల సంగమం చోటే స్నానం చేశారని ఎద్దేవా చేశారు.
వైయస్ జగన్ పుష్కర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. దీనిపై దేవినేని మాట్లాడారు. జగన్ పట్టిసీమను వ్యతిరేకించారని మండిపడ్డారు. ఏ ప్రాజెక్టునైతే జగన్ వ్యతిరేకించారో.. ఆ నీరు కలిసిన చోట ఆయన స్నానం చేశారని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చూసి జగన్ ఏం మాట్లాడుతారన్నారు. పుష్కరాల పైన జగన్ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. జగన్ శరీరమంతా విషమే ఉందన్నారు. పుష్కరాలను కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.
ప్రమాదశాత్తు ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోతే, దానిని కూడా జగన్ రాజకీయ చేయడం ఏమిటన్నారు. పుష్కరాలు అద్భుతంగా జరుగుతుంటే అతను ఓర్వలేకపోతున్నారన్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
కాగా, పుష్కరాల పేరుతో ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చు చేస్తోందని జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అదే సమయంలో కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతిలో నీట మునిగి మృతి చెందిన నందిగామ కుటుంబ సభ్యులను పరామర్శించారు.