జగన్ను అభినందించిన రామోజీ రావు, ఏం మాట్లాడుకున్నారు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. మాదాపూర్లోని హైటెక్స్లో మంచు మనోజ్ వివాహం ఉదయం జరిగింది. ఈ వేడుకకు జగన్, రామోజీ రావు సహా ప్రముఖులు హాజరయ్యారు.
రామోజీ రావును చూడగానే జగన్ ఆయన వద్దకు వెళ్లి నమస్కరించారు. అందుకు రామోజీ రావు లేచి ఆయనతో చేయి కలిపారు. ఈ సందర్భంగా వారు పరస్పరం మాట్లాడుకున్న విషయం తెలిసిందే. రామోజీ రావును పలకరించిన అనంతరం జగన్ ఆయన పక్కనే మరో సోఫాలో కూర్చున్నారు.
ఈ సమయంలో వారి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. మాటల మధ్యలో వారిద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవహారాల గురించి జగన్ అడిగినట్లుగా తెలుస్తోంది. దానికి బాగున్నాయని రామోజీ రావు సమాధానమిచ్చారు.
అదే సమయంలో ఎండల్లో కూడా కష్టపడి జనాల్లో తిరుగుతున్నావని జగన్ను రామోజీ రావు అభినందించారు. గత కొద్ది రోజులుగా జగన్ ఏపీలో భరోసా యాత్ర పేరుతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, జూన్ 3, 4 తేదీల్లో రాజధాని ప్రాంతంలో దీక్ష చేయనున్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టనున్నారు.