నేత హత్యపై వాసిరెడ్డి, సునీత హస్తమని ఆరోపణ
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వరుస హత్యల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అన్న అనుమానం కలుగుతోందని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ బుధవారం హైదరాబాదులో ఆందోళన వ్యక్తం చేశారు. అనంత వైసీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్యను ఆమె తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబు నాయుడు సర్కార్ దాడులను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలను వెంటాడి వేటాడి చంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలను అంతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. అందుకు అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్నారు. ప్రసాద్ రెడ్డిని చంపిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
వారి హస్తం: ఆనంద్ రెడ్డి
తన సోదరుడు ప్రసాద్ రెడ్డి హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తముందని మృతుడి సోదరుడు ఆనంద్ రెడ్డి ఆరోపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రసాద్ రెడ్డికి ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని తాము ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు.
ప్రసాద్ రెడ్డి హత్య నేపథ్యంలో రాప్తాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో బుధవారం ఉదయం తహసీల్దారు కార్యాలయంలో పట్టపగలు ప్రసాద్ రెడ్డిని కొందరు దుండగులు హతమార్చిన విషయం తెలిసిందే. ఆరుగురు వేటకొడవళ్లతో నరికి చంపారు.